హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రతిపక్షాలపై అణచివేత ధోరణిని ఎండగడుతూ హైదరాబాద్ నగరంలో వెలిసిన పోస్టర్లు ఆలోచింప జేస్తున్నాయి. దేశంలో బ్రిటిష్ కాలంనాటి పరిస్థితులు ఏర్పడ్డాయని గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు కాషాయ పార్టీని కలవరానికి గురిచేశాయి. ఆనాడు స్వాతంత్య్ర సమరయోధులను బ్రిటిష్పాలకులు అణచివేస్తే.. ఈనాడు బీజేపీ నాయకులు.. ప్రతిపక్ష నాయకుల నోరు నొక్కుతున్నారని పోస్టర్లలో పేర్కొన్నారు.
బ్రిటిష్పాలన తరహాలోనే బీజేపీ పాలన ఉందంటూ చురకలంటించారు. పోస్టర్లలో పై వరుసలో నాడు స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మాగాంధీ, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్ నోర్లను బ్రిటిషర్లు నొక్కేసినట్టు.. కింది వరుసలో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీశ్కుమార్ నోర్లను బీజేపీ నొక్కేస్తున్నదని చిత్రీకరించారు. ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది.. మహాత్మా కాపాడు’ అనే నినాదాలను ముద్రించారు. పోస్టర్ల చివరి భాగంలో ‘బైబై మోడీ’ అనే హ్యాష్ట్యాగ్ను ఉంచారు. ఈ పోస్టర్లను ప్రజలు, మేధావులు ఆసక్తిగా గమనిస్తున్నారు. దేశంలో బీజేపీ పాలన బ్రిటిషర్ల పాలనను తలపిస్తున్నదని మండిపడుతున్నారు.