సిటీబ్యూరో, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): ఆరోగ్యకరమైన హైదరాబాదే లక్ష్యంగా జీహెచ్ఎంసీ మరిన్ని వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నది. అందులో భాగంగా మహా నగరంలో శుక్రవారం మరో 32 బస్తీ దవాఖానలను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. ప్రతి ఐదువేల నుంచి 10 వేల జనాభాకు ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రెక్కాడితే కాని డొక్కాడని పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న భావించి జీహెచ్ఎంసీ పరిధిలో 350 వర కు బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే ఆరోగ్య హైదరాబాద్ ధ్యే యంగా వైద్య ఆరోగ్య శాఖతో కలిసి జీహెచ్ఎంసీ 226 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయగా రోజూ సుమారు 20వేల మందికి పైగా వైద్య సేవలు పొందుతున్నారు. 57 రకాల ఆరోగ్య పరీక్షలు జరుపుతూ 150 రకాల మందు లు అందిస్తున్నారు. బస్తీ దవాఖానాలకు పేదల నుంచి విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో మరో 32 దవాఖానాలను నేడు మంత్రులు హరీశ్ రావు, కేటీ రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, విప్ అరికపూడి గాంధీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డిలు కలిసి ప్రారంభించనున్నారు.
మేడ్చల్లోనూ పది బస్తీ దవాఖానలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా నేడు 10 బస్తీ దవాఖానలు ప్రారంభం కానున్నాయి. బస్తీ దవాఖానల ప్రారంభానికి సర్వం సి ద్ధం చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు వెల్లడించారు. 10 బస్తీ దవాఖానల ప్రారంభంతో మరింత వైద్య సేవలు విస్తరించనున్నాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బస్తీ దవాఖానలను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దవాఖానలను ప్రారంభించనున్నారు.