హుజూరాబాద్టౌన్ : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ గ్యాస్ విషయంలో మరోసారి తప్పులో కాలేసి తన అవగాహనా లేమిని, తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. ఇటీవల తన ప్రచార ప్రసంగాల్లో గ్యాస్ సిలిండర్ ధరలో రూ. 291 రాష్ర్ట ప్రభుత్వం వసూలు చేస్తోందని ఆరోపించారు. దీనిపై ఆధికార పార్టీ నాయకులు విసురుతున్న సవాళ్లకు సమాధానాలు చెప్పలేక ఈటల సతమతమవుతున్నాడు.
గ్యాస్ సిలిండర్ ధరలో రూ. 291 రాష్ర్ట ప్రభుత్వం వసూలు చేస్తోందన్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి ట్రబుల్ షూటర్ హరీశ్రావు ఘాటుగా తగిన రీతిలో స్పందించారు. జీఎస్టీ తప్ప రాష్ర్టప్రభుత్వం రూ. 291 వసూలు చేసినట్లు ఈటల నిరూపిస్తే తాను హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమని, నిరూపించకపోతే ఈటల పోటీ నుండి తప్పుకుంటారా? అని సవాల్ చేశారు.
దీనికి బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈటల ఇప్పటి వరకు స్పందించలేదు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత అవగాహన లేని, పరిపక్వత లేని స్టేట్మెంట్స్ ఇవ్వడం, అధికార పార్టీ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడం చర్చనీయాంశం అవుతోంది. మాజీ మంత్రికి తెలిసి ఈ విధంగా ప్రకటనలు చేస్తున్నారా? లేకుండా అజ్ఞానంతో చేస్తున్నారా? అనేది సొంత కాషాయ పార్టీలోనే చర్చకు దారితీస్తోంది.
ఉప్పల్ యాక్సిడెంట్ విషయంలోనూ అదే తీరు..
కమలాపూర్ మండలం ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ ఈటల, బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. అసలు విషయం తెలుసుకోకుండానే వేగంగా స్పందించి అభాసుపాలు, నలుగురిలో నవ్వుల పాలు కావడం కాషాయ శ్రేణులను తలదించుకునేలా చేసింది.
బాల్క సుమన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ మృతికి కారణమైన కారు బండి సంజయ్ అనుచరునిదని, టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పూర్తి ఆధారాలతో వెల్లడించారు. కనీసం కౌంటర్ ప్రెస్మీట్ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి బీజేపీ నేతలకు ఎదురైంది.
కందిపప్పు కుంభకోణం పైనా..!
ఈటల పౌరసరఫరాల మంత్రిగా ఉన్న సమయంలో కందిపప్పు కుంభకోణం జరిగిందని, ఇందులో ఈటల అపరిచితుడని, అవినీతికి పాల్పడ్డాడని వ్యాపారవేత్త కన్నా శివకుమారి ఆరోపించారు. ఈటలపై ఆమె తీవ్ర విమర్శలు చేయడంతోపాటు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది, దీనిపై కూడా బీజేపీ నేతలు ఇప్పటి వరకు స్పందించలేదు.
అలాగే పలుసార్లు పాడి కౌశిక్రెడ్డి కూడా ఈటలకు సవాల్ చేయగా ఎవరూ స్పందించలేక పోయారు. ఇంకోవైపు ఈటల అధికారంలో ఉన్నప్పుడు పోలీసు కేసులు, వేధింపులు ఎదుర్కొన్నవారు కూడా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఈటల తీరును ఎండగట్టారు. ఏది ఏమైనా మాజీ మంత్రి ఈటలతో పాటు బీజేపీ నేతలు తొందరపాటుగా వ్యవహరిస్తూ వారికీ వారే సెల్ఫ్గోల్ చేసుకుంటున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.