న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార మైకంలో ఉన్నట్లు సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోపించారు. లిక్కర్ స్కామ్ అంశంపై అన్నా హజారే అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు ఘాటైన లేఖను రాశారు. 2012లో అన్నా హజారే, కేజ్రీవాల్ .. దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉద్యమం నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఇతర పార్టీల బాటలో ఉన్నట్లు హజారా ఆరోపించారు. ఢిల్లీలో కొత్త అబ్కారీ విధానం అమలులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ విచారిస్తోంది. మద్యం మత్తు ఎలాగ ఉంటుందో, అలాగే అధికార మైకం కూడా ఉంటుందని, ఆ అధికార దాహంలో నువ్వు కూడా మునిగిపోయావని కేజ్రీవాల్ను ఉద్దేశిస్తూ అన్నా హజారే లేఖ రాశారు.