డెహ్రాడూన్ : రిషీకేష్లో బీజేపీ నేతకు చెందిన రిసార్ట్లో రిసెప్షనిస్ట్ అంకితా భండారి హత్యోదంతంలో నిందితులను ఉరితీయాలని ఆమె తల్లి డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వారిని ఉరితీయలేని పక్షంలో వారి ఇండ్ల ఎదుటే నిందితులను సజీవ దహనం చేయాలని ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అధికారులను కోరారు. తనకు సమాచారం ఇవ్వకుండానే తన కూతురి అంత్యక్రియలు నిర్వహించారని ఆమె ఆరోపించారు.
ఉత్తరాఖండ్లోని కాలువలో ఆమె మృతదేహం లభించిన మరుసటి రోజు ఆదివారం హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. రిషీకేష్లోని రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న యువతి (19)ని ఆమె యజమాని హత్య చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో బీజేపీ నేత కొడుకు, రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆధారాలు మాయం చేసేందుకే అధికారులు నిందితుడి రిసార్ట్ను హుటాహుటిన కూల్చివేశారని విపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ కేసులో పుల్కిత ఆర్య సహా ఇద్దరు నిందితులను ఉరితీయాలని బాధితురాలు అంకిత భండారి కుటుంబ సభ్యులు, స్ధానికులు కాంగ్రెస్ నేత హరీష్ రావత్ ద్వారా సీఎం పుష్కర్ సింగ్ ధామికి వినతి పత్రం అందించారు. యువత హత్యోదంతం నేపధ్యంలో పాలక బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శల దాడి తీవ్రతరం చేశాయి.