న్యూఢిల్లీ: అంకితా భండారి హత్య కేసులో అరెస్టయిన వనాంతర రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్య, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా మహిళా ఉద్యోగులపట్ల అసభ్యంగా వ్యవహరించేవారని.. ఆ రిసార్టులో పనిచేసి మానేసిన ఓ మహిళా ఉద్యోగి వెల్లడించింది. ఆ ఇద్దరూ అమ్మాయిలను అసభ్య పదజాలంతో దూషించేవారని తెలిపింది.
వనాంతర రిసార్టుకు ఎప్పుడూ వీఐపీలు వస్తుండేవారని, వారిలో కోరినవారికి పడక సుఖం అందించేందుకు బయటి నుంచి అమ్మాయిలను తీసుకొస్తుండే వారని ఆ మాజీ ఉద్యోగిని తెలియజేసింది. ఈ ఏడాది మే నెలలో ఆ రిసార్టులో ఉద్యోగంలో చేరిన నేను వారి ప్రవర్తనతో భయపడి జూలైలో మానేశానని చెప్పింది. అంకితా భండారి హత్య కేసులో పుల్కిత్ ఆర్య ప్రధాన నిందితుడు కాగా, అంకిత్ గుప్తా నిందితుడిగా ఉన్నాడు.
ఈ నెల 18న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరి జిల్లాలో వనాంతర రిసార్టులో రిసెప్షనిస్ట్గా పనిచేసే అంకితా భండారి హత్యకు గురైంది. రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా నిందితులుగా తేలడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సీనియర్ పొలిటీషియన్ అయిన పుల్కిత్ ఆర్య తండ్రి వినోద్ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి తొలగించింది.