హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తేతెలంగాణ) : కొత్త ఫోన్లు చేతికొచ్చినా అంగన్వాడీ టీచర్ల కష్టాలు తీరడం లేదు. యాప్లలో లబ్ధిదారులు, పోషకాహారం పంపిణీ వివరాల నమోదులో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తరచూ చార్జింగ్ పెట్టాల్సి వస్తుందని అసహనంతో రగిలిపోతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలందించే లక్ష్యంతో పోషణ్ అభియాన్ కింద కేంద్రం అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లను పంపిణీ చేస్తున్నది. టెండర్లు పిలిచి పంపిణీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. గతేడాది తెలంగాణలో 38,110 సెల్ఫోన్ల కొనుగోలుకు రూ.54 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ శాంసంగ్ గెలాక్సీ ఏ06 మోడల్ 64/4జీ కెపాసిటీ ఫోన్లను అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేసింది. ఇందుకు ఒక్కో ఫోన్కు రూ.11,650 వెచ్చించింది. ఆంధ్రప్రదేశ్తోపాటు దేశంలోని అత్యధిక రాష్ర్టాల్లో 5జీ ఫోన్లను పంపిణీ చేశారు. తెలంగాణలో మాత్రం 4జీ ఫోన్లను అందించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 5జీ ఫోన్లకు బదులు తక్కువ సామర్థ్యం కలిగిన ఫోన్లను ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని పక్కనబెడితే కొత్తగా పంపిణీ చేసిన ఫోన్ల వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి .
అంగన్వాడీ టీచర్లు నిత్యం తమ పరిధిలో వివిధ రకాల వివరాలను నమోదు చేస్తుంటారు. ఆ వివరాల నమోదులో జాప్యం జరుగుతున్నదని చెప్తున్నారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో లబ్ధిదారుల పేస్ క్యాప్చరింగ్తోపాటు పౌష్ఠికాహారం వివరాలు పోషణ్ట్రాకర్ యాప్లో నమోదు చేయాలి. పిల్లల ఎత్తు, బరువు, ఇతరత్రా ఆరోగ్య వివరాలను ఎన్హెచ్టీఎస్ (న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం)లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. కొత్తగా ప్రభుత్వం పంపిణీ చేసిన ఫోన్లలో పైవివరాల నమోదుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని టీచర్లు వాపోతున్నారు. కొత్తఫోన్లతోనైనా కష్టాలు తీరుతాయని భావించిన తమకు తీవ్ర నిరాశే ఎదురైందని వాపోతున్నారు. ఈ ఫోన్లలో గ్యాలరీ ఫెసిలిటీ లేకపోవడంతో నేరుగా యాప్లలో ఫైళ్ల రూపంలో నమోదవుతున్నాయని చెప్తున్నారు. దీంతో తిరిగి చూసుకొనే అవకాశం ఉండటం లేదని, గతంలో మాదిరిగానే ఆలస్యమవుతుందని చెప్తున్నారు. రోజులో తరచూ సెల్ఫోన్ చా ర్జింగ్ పెట్టడంతోపాటు రాత్రంతా పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
5జీ కాలంలో అంగన్వాడీ టీచర్లకు 4జీ సెల్ఫోన్లను కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమతున్నాయి. కేంద్రం కేటాయించిన నిధులతో 5జీ మోడల్ ఫోన్లు కొనుగోలు చేసే అవకాశం ఉన్నా ఎందుకు విస్మరించారనే ప్రశ్నలు అంగన్వాడీ యూనియన్ల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. పక్క రాష్ట్రంలో 5జీ ఫోన్లు ఇవ్వగా తెలంగాణలో పాత మోడల్ ఫోన్లను ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. శాంసం గ్ ఏ06 గెలాక్సీ ఫోన్ల తయారీని ఆరునెలల క్రితమే నిలిపివేసినట్టు తెలుస్తున్నది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ సదరు కంపెనీతో కుమ్మక్కై పాత ఫోన్లను కట్టబెట్టినట్టు ఆరోపణలున్నాయి. అత్యధిక శాతం అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లను పక్కనబెట్టి వ్యక్తిగత ఫోన్లలోనే లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త మోడల్ ఫోన్లను అందజే యాలని అంగన్వాడీలు కోరుతున్నారు.