హైదరాబాద్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): నకిలీ ఆధార్ కార్డులతో భక్తులను తిరుమలలో దర్శనానికి తరలిస్తున్న ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జిని టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తరుచూ శ్రీవారి దర్శనానికి వస్తున్న ఆయనపై అనుమానంతో విజిలెన్స్ వింగ్ అధికారులకు అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. వారు ఆయ నను తనిఖీ చేయగా ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళ్తున్నట్టు గుర్తించారు.
నెల రోజుల్లో 19 సిఫార్సు లేఖలు జారీ చేసి.. ఆరుగురి నుంచి రూ.లక్ష వసూలు చేసినట్టు తేలింది. భక్తుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీ సాబ్జిని అదుపులోకి తీసుకున్నారు. షేక్ సాబ్జిపై తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీవారి దర్శనాల్లో ఎమ్మెల్సీ సాబ్జి అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించామని విజిలెన్స్ వీజీవో గిరిధర్ వెల్లడించారు. భక్తుల ఆధార్ కార్డులు నకిలీవని తేలిందన్నారు. డ్రైవర్ రాజుతో పాటు ఎమ్మెల్సీని పోలీసులకు అప్పగించామని చెప్పారు.