అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నార్కోటిక్స్ హబ్గా మారిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రతిస్థాయిలో అనేక మంది డ్రగ్స్ మాఫీయాతో నిండిపోయిందని, దీని ప్రభావం దేశం మొత్తం చూపుతోందని బుధవారం వరుస ట్వీట్లలో ఆరోపించిన ఆయన.. పలు రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారుల ప్రెస్మీట్లకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను ట్యాగ్ చేశారు. గంజాయి సాగు నిజంగా సామాజిక ఆర్థిక అంశమని, విశాఖ మన్యం నుంచి తుని వరకు ఉపాధి లేని, చదువు పూర్తయిన కుర్రాళ్లు ఈ ట్రేడ్లో చిక్కుకుంటున్నారని, కీలక వ్యక్తులు మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారన్నారు.
మన్యంలో ఇప్పుడు గంజాయి పంట ముఖ్య దశలో ఉందని.. నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుందని.. అప్పుడు ఇంకా ఎక్కువగా బయటికి వెళ్తుందన్నారు. గతంలో గంజాయి పంటను పోలీసులు, ఆబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారని.. ఆ పని వదిలి.. బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారని ఆరోపించారు. 2018లో తాను ఆంధ్రా ఒడిశా సరిహద్దులో విస్తృతంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పర్యటించానని, ఆ సమయంలో ఏఓబీలో గంజాయి మాఫియా, నిరుద్యోగం, అక్రమ మైనింగ్పై ఫిర్యాదులు వచ్చాయన్నారు. గంజాయిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక అంతర్రాష్ట్ర టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.