తిరుమల : అనంత పద్మనాభవ్రతం సందర్భంగా తిరుమలలో ఆదివారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. కొవిడ్ నిబంధనల మేరకు కార్యక్రమం ఏకాంతంగా జరిగింది. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేపట్టారు.
అనంతరం చక్రస్నానం నిర్వహించారు. మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో.. అదేవిధంగా శయన మూర్తిగా అనంత పద్మనాభస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభవ్రతం పర్వదినాల్లో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు.