సదాశివపేట, జనవరి 8: వ్యాపార కేంద్రంగా ఉన్న సదాశివపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. రూ.5.50 కోట్లతో పట్టణంలోని మార్కెట్ యార్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టారు. కూరగాయలు, మాంసం, చేపలు.. ఇలా అన్నీ ఒకే చోట లభించేలా అధికారులు మార్కెట్ డిజైన్ చేశారు. మార్కెట్కు వచ్చే ప్రజల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ జోన్, మరుగుడొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. రోజూ కూరగాయలు తీసుకొచ్చే ట్రక్లు సులువుగా లోడింగ్, అన్లోడింగ్ చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. మార్చి నాటికి పనులన్నీ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ కృషితో త్వరలోనే పట్టణ ప్రజలకు వెజ్, నాన్వెజ్ మార్కెట్ అందుబాటులోకి రానున్నది. దీంతో పేట ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై వేనోళ్ల పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
రూ.5.50 కోట్లతో నిర్మాణం
పట్టణంలోని మార్కెట్ యార్డులో రూ.5.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ను ప్రభుత్వం నిర్మిస్తున్నది. కలెక్టర్ శరత్ పనులను పర్యవేక్షించి త్వరలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను
ఆదేశించారు.
ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్..
పేటలో చిరువ్యాపారులు ప్రస్తుతం రోడ్లపైనే కూరగాయలు పెట్టి విక్రయిస్తున్నారు. రోడ్ల పక్కన రేకుల షెడ్లను ఏర్పాటు చేసి మాంసం అమ్ముతున్నారు. పట్టణంలో బుధ, ఆదివారం.. రెండు రోజులు వారాంతపు సంత ఉం టుంది. ఆదివారం గురునగర్ కాలనీకి వెళ్లే రోడ్డులో సంత నిర్వహిస్తారు. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు పెట్టుకుని అమ్ముతారు. తోపుడుబండ్ల వ్యాపారులు రోడ్డు మధ్యలోనే బండ్లు పెట్టి పండ్లను విక్రయిస్తున్నారు. దీంతో ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాలను పార్కింగ్ చేసేందుకు స్థలం లేకపోవడంతో రోడ్డు పక్కనే పార్కింగ్ చేయాల్సి వస్తుంది. బుధవారం సంత దుర్గమ్మ గుడి, బైపాస్ రోడ్డులో కొనసాగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు రోడ్డుపైనే కూరగాయలు పెట్టి విక్రయిస్తారు. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు పార్కింగ్ చేయడంతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. వెజ్, నాన్వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు తీరినట్లే.
60 శాతం పనులు పూర్తయ్యాయి..
రూ.5.50 కోట్లతో పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వం వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మిస్తున్నది. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 60 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే మార్చిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నాం.
– కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్, సదాశివపేట