ఇస్లామాబాద్, జనవరి 8: పొరుగు దేశం పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నది. ఇప్పటికే ఆ దేశాన్ని ఆర్థిక కష్టాలు ముంచెత్తగా ఇప్పుడు ఆహార సంక్షోభం కూడా తోడైంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. పాక్ ఎగుమతులు తగ్గిపోయి దిగుమతులు పెరిగిపోయాయి. విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. డాలర్తో పాక్ రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతున్నది. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే పుట్టిన ప్రతి చోట అప్పు తెచ్చి వడ్డీలు కడుతున్నది. కొత్త అప్పుల కోసం ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఆర్థిక సమస్యలతో బ్యాంకులు సరుకు దిగుమతులకు ఇవ్వాల్సిన లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వటం లేదు. ఫలితంగా నిత్యావసరాల దిగుమతికి ఆటంకం ఏర్పడుతున్నది. ఇవన్నీ చూస్తుంటే పాకిస్థాన్ కూడా శ్రీలంక బాటలో దివాళా దిశగా పయనిస్తున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దారుణంగా పడిపోయిన ఆర్థిక వ్యవస్థ
పాకిస్థాన్ ఆర్థిక స్థితి ఏనాడూ మెరుగ్గా ఏమీ లేదు. కానీ, గత ఏడాదిగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. 2022లోనే డాలర్తో పోల్చితే పాక్ రూపాయి విలువ ఏకంగా 30 శాతం పడిపోయింది. మరోవైపు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ద్రవ్యోల్బణం 23 శాతం వరకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆర్థిక కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ను గత ఏడాది జూన్ నుంచి అక్టోబరు వరకు వరదలు ముంచెత్తడంతో మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు అయింది. వరదల్లో దేశంలో మూడో వంతు మునిగిపోయింది. వరదల కారణంగా సుమారు రెండున్నర లక్షల కోట్ల నష్టం ఏర్పడిందనే అంచనాలు ఉన్నాయి.
భారీగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు
పాక్లో నిత్యావసరాల కొరత ఏర్పడింది. నూనె, నెయ్యి తదితర వస్తువులకు ఇప్పటికే కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. పాక్ ప్రజలు వాడే దాదాపు 90 శాతం వంటనూనె ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతుంది. నెల రోజుల్లోనే వంట నూనె లీటరుకు రూ.26 పెరిగింది. మరోవైపు చికెన్, గోధుమ పిండి ధరలు ఆకాశాన్ని అంటాయి. రంజాన్ నెల సమీపిస్తున్న వేళ ధరలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అప్పుల కోసం ప్రభుత్వం తిప్పలు
ఆర్థిక కష్టాల నుంచి తాత్కాలికంగానైనా ఉపశమనం పొందేందుకు కొత్త అప్పులు తెచ్చుకోవడం మినహా మరో మార్గం లేదని పాక్ ప్రభుత్వం భావిస్తున్నది. కొత్త అప్పుల కోసం నానాపాట్లు పడుతున్నది. 3 బిలియన్ డాలర్ల అప్పు కావాలని సౌదీ అరేబియాను అడుగుతున్నది. బెయిలవుట్ ప్రోగ్రామ్ కింద నిధుల కోసం ఐఎంఎఫ్తో పాక్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నది. చైనా నుంచి కూడా అప్పుల కోసం ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే ఆ దేశ మొత్తం అప్పుల్లో చైనా ఇచ్చినవే 30 శాతం వరకు ఉంటాయి.
దిగుమతులే ఆధారం
వరదల కారణంగా పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా పాక్ నుంచి ఎగుమతులు భారీగా పడిపోయాయి. ఇదే సమయంలో నిత్యావసరాల కోసం దిగుమతులపై ఆధారాల్సిన పరిస్థితి పెరిగింది. దీంతో వాణిజ్య లోటు పెరగడంతో పాటు విదేశీ మారక నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఎనిమిదేండ్లలో అత్యంత తక్కువ మారక నిల్వలు ఇప్పుడు పాక్ వద్ద ఉన్నాయి. ఇవన్నీ పాక్ ఆర్థిక కష్టాలను మరింత పెంచుతున్నాయి. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్ముతున్న పాక్ కరెంటు పొదుపు కోసం మాల్స్, మార్కెట్లను చీకటి పడగానే మూసివేయిస్తున్నది. దాదాపు సగం వీధి దీపాలు వెలిగించడం లేదు. ఈ ప్రయత్నాల వల్ల 273 మిలియన్ డాలర్ల విలువైన ఇందన దిగుమతులు తగ్గుతాయని పాక్ ఆశిస్తున్నది.