మేడ్చల్, జనవరి 24(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దళితబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొదటి దశలో నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఐదు నియోజకవర్గాల్లో కలిపి 500 మంది దళితులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే దళిత బంధు పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ ప్రత్యేక ఇంటర్య్యూలో తెలిపారు.
ప్రశ్న: జిల్లాలో ‘దళితబంధు పథకం’ అమలు ఎంత వరకు వచ్చింది?
కలెక్టర్: జిల్లాలో దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నాం. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఫిబ్రవరి 5వ తేదీ వరకు దళితబంధు జాబితాను పూర్తి చేసి ఎంపికైన లబ్ధిదారులకు ప్రత్యేకంగా రెండు రోజులలో బ్యాంకు ఖాతాలను తెరిపిస్తాం. ఫిబ్రవరి చివరి వారంలో దళితబంధు నగదును రూ.10 లక్షలను జమ చేస్తాం.
పథకం అమలుకు క్షేత్రస్థాయి ప్రణాళిక ఎలా ఉండబోతుంది?
దళితబంధు అమలుకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు జిల్లా స్థాయి అధికారులైన ఐదుగురిని ప్రత్యేక అధికారులుగా నియమించాం. స్థానిక ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక అధికారులు అర్హులను ఎంపిక చేస్తారు.
జిల్లాలో ఈ పథకానికి మొదటి దశలో ఎన్ని నిధులు మంజూరు అయ్యాయి?
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో మొదటి దశలో 500 మంది దళితులకు ఈ పథకం వర్తింపజేసేందుకు రూ.50 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. నియోజకర్గానికి వంద యూనిట్ల చొప్పున ఐదు వందల మందికి పథకాన్ని వర్తింపజేస్తాం.
పథకం అమలుపై సమన్వయ కమిటీ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారు?
దళితబంధు పథకం పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తాం. ఇందుకు స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారాన్ని ప్రత్యేక అధికారులు తీసుకుంటారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ప్రత్యేక అధికారులు
నియోజకవర్గం : ప్రత్యేక అధికారి
మల్కాజిగిరి :జి.బల రామారావు (జిల్లా క్రీడల అధికారి)
కూకట్పల్లి :పి.రవీందర్ (పరిశ్రమల జిల్లా మేనేజర్)
కుత్బుల్లాపూర్ :ఈ.మల్లయ్య (మల్కాజిగిరి డివిజన్ ఆర్డీవో)
ఉప్పల్ :ఎన్.రవి (కీసర డివిజన్ ఆర్డీవో)
మేడ్చల్ : కె.పద్మజారాణి (డీఆర్డీఏ జిల్లా అధికారి)