‘నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రను ఈ సినిమాలో చేశా. స్నేహానికి అమితంగా విలువనిచ్చే యువతిగా విభిన్నంగా నా క్యారెక్టర్ సాగుతుంది’ అని చెప్పింది అమృతా అయ్యర్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. శ్రీవిష్ణు హీరోగా నటించారు. తేజ మార్ని దర్శకుడు. ఈ నెల 31న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో అమృతా అయ్యర్ పాత్రికేయులతో ముచ్చటిస్త్తూ ‘ఐదుగురు ప్రాణస్నేహితుల కథ ఇది. ఇందులో స్నేహితుడికి సాయం చేసేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే యువతిగా నేను కనిపిస్తా. నిజజీవితంలో ఇబ్బందుల్లో ఉన్న ఫ్రెండ్స్కు సాయపడుతుంటా. అందువల్లే క్యారెక్టర్తో బాగా కనెక్ట్ అయ్యా.
రాజమండ్రి బ్యాక్డ్రాప్లో వాస్తవ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు తేజ మార్ని ఈ సినిమాను తెరకెక్కించారు. కుటుంబ విలువలతో పాటు చక్కటి థ్రిల్ను పంచుతుంది. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడ్డాం. కొండలపై కొన్ని రోజులు షూట్ చేశాం. అక్కడకు వెళ్లడానికే ప్రతి రోజు మూడు గంటలు నడవాల్సివచ్చేది. నటిగా సవాళ్లతో కూడిన పాత్రల కోసం ఎదురుచూస్తున్నా. గ్లామర్ పాత్రలు చేయను. ప్రస్తుతం ప్రశాంత్వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ సినిమా చేస్తున్నా’ అని చెప్పింది.