కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం నాడిక్కడ విడుదల చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని, ఇంటికో ఉద్యోగం వచ్చేలా చూస్తామని బీజేపీ ఎన్నికల హామీలు గుప్పించింది. అధికారంలోకి రావడమే పరమావధిగా అమలుచేయడానికి వీలుకాని హామీలను కూడా తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చారని అధికార తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది.
బీజేపీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలు : ఇంటికో ఉద్యోగం, మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7 వ పే కమిషన్ అమలు, 75 లక్షల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఒక్కొక్కరికి రూ.18 వేలు అందజేత వంటి అంశాలను చేర్చారు. ఆదివారం సాయంత్రం ఈస్టర్న్ జోనల్ కల్చరల్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్షా తమ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసి చాలా మంచి హామీలను ఇచ్చామని, వీటి ద్వారానే తమ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తుందని ఘంటాపథంగా చెప్పారు.
అనంతరం పర్బా మేధినీపూర్ జిల్లా పరిధిలోని ఈగ్రా పల్లిఘాయ్ స్కూల్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో అమిత్షా మాట్లాడారు. మార్చి 27 నుంచి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమై ఏప్రిల్ 29న ఎనిమిది దశల్లో ముగియనున్నాయి. మే 2 వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక్కడ ముక్కోణపోటీ అనివార్యమైంది.
తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ-కాంగ్రెస్,వామపక్ష కూటమి మధ్య పోటీ జరుగుతున్నది. తన బహిరంగ సభలకు హాజరవుతున్న జనాన్ని బట్టి ఈసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీదే అధికారం అని తెలుస్తున్నదని శనివారం రాత్రి నిర్వహించిన ఒక బహిరంగసభలో ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.