హైదరాబాద్: ఆంధ్రాలో గోదావరి నది ఉప్పొంగుతున్న విషయం తెలిసిందే. భారీ వరదలతో కోనసీమ ప్రాంతం గోదారమ్మ నీటితో నిండిపోయింది. పచ్చని కొబ్బరి చెట్లతో కళకళలాడే ఆ ప్రాంతం ఇప్పుడు జలమయం అయ్యింది. అయితే శుక్రవారం కోనసీమలో జరిగిన ఓ పెళ్లివేడుకకు ఆ రాష్ట్రానికి చెందిన ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహకరించాయి. వరదల వల్ల కోనసీమ జిల్లాలో రోడ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. దీంతో ఓ పెళ్లి కూతుర్ని .. అబ్బాయి ఇంటికి తరలించేందుకు ఇబ్బందిగా మారింది. ఆ సమయంలో అక్కడున్న ఎస్డీఆర్ఎఫ్ దళాలు వధువును ప్రత్యేక బోట్లలో వరుడి ఇంటికి తరలించారు. ఆ పెళ్లికి వచ్చిన అతిథుల్ని కూడా బోట్లలో సురక్షితంగా వరుడి ఇంటికి చేర్చారు. కోనసీమ నీట మునిగినా.. ముహూర్తానికే ఓ కొత్త జంటను ఏకం చేసిన ఘనత ఎస్డీఆర్ఎఫ్కు దక్కింది.