హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. అంబేదర్ ఆలోచనలు సదా ఆదర్శనీయమని పేర్కొన్నారు. అంబేదర్ వర్ధంతి సందర్భంగా ప్రగతిభవన్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్మిక మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్రెడ్డి, నవీన్కుమార్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ అంబేద్కర్ కన్న కలల్ని సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని మండలి చైర్మన్ ప్రొటెం, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎస్ వాణీదేవి, దయానంద్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు, టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణభవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.