AP Capital : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అభవృద్ధి చేస్తుండటంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అమరావతి కంటే తిరుపతిని రాజధానిగా చేయడం మంచిదని ప్రతిపాదించారు. అమరావతిని రాజధానిగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఇష్టపడటం లేదని చెప్పారు.
అమరావతిని రాజధానిని చేయడం ఇష్టంలేని ప్రజలు దానిని ‘చంద్రావతి’ అని హేళనగా అంటున్నారని చింతా మోహన్ ఎద్దేవా చేశారు. తిరుపతిని రాజధానిగా చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆమోదిస్తారని అన్నారు. డిజిటల్ యుగంలో పాలన సాగుతున్నప్పుడు లక్ష ఎకరాల రాజధాని ఎందుకని ఆయన ప్రశ్నించారు. కేవలం వెయ్యి ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే సరిపోతుందని, భారీ ప్రాజెక్టులవల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని హెచ్చరించారు.
ఇక దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై కూడా చింతా మోహన్ స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజనవల్ల ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంలో తీవ్ర అసమానతలు ఏర్పడుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరాదికి 600 సీట్లు వస్తే, దక్షిణాదికి కేవలం 200 సీట్లు వచ్చే ప్రమాదం ఉందని, ఇది దేశ విభజన భావజాలానికి దారితీయవచ్చని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, కానీ డీలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తొందరపడకూడదని ఆయన సూచించారు.