అమరావతి : అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ చేపట్టిన రైతుల దీక్ష వెయ్యిరోజులు గడిచిన సందర్భంగా మలివిడత మహాపాదయాత్ర ఇవాళ ప్రారంభమైంది. అమరావతి నుంచి అరసపల్లి వరకు నిర్వహించనున్న పాదయాత్ర ప్రారంభం సందర్భంగా వెంకటపాలెం శివారు టీటీడీ దేవాలయంలో రైతులు పూజలు నిర్వహించారు. సర్వమత ప్రార్థనలు చేసి యాత్రను ప్రారంభించారు.
కాగా పాదయాత్రలో వేంకటేశ్వరస్వామి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . వైసీపీ కార్యకర్తలు సైతం పాదయాత్రకు మద్దతు తెలపడం విశేషం. వారి ఆధ్వర్యంలోనే రథం నడిపే బాధ్యతను రైతులు అప్పగించారు. కొద్ది దూరం ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు, సీపీఐ నాయకుడు నారాయణ, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ రథాన్ని నడిపి రైతులను ఉత్సాహపరిచారు.
రెండు నెలలపాటు సుమారు 900 కిలోమీటర్ల వరకు కొనసాగే పాదయాత్రకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు మద్దతు పలికాయి. . రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రాష్ట్రప్రజలను చైతన్య పరిచేందుకు పాదయాత్రనునిర్వహిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు.