వెండితెరపై దేవుడి పాత్రలో నటించాలి అంటే చాలా గట్స్ ఉండాలి. కొందరు నటులు దేవుడి పాత్రలో నటించేందుకు అస్సలు ఇష్టపడరు. ఎక్కడ ప్రేక్షకులతో విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందో అని ఆ పాత్రలకు నో చెబుతారు. తెలుగు సినీ పరిశ్రమలో దేవుడిగా మెప్పించిన వారిలో నందమూరి తారకరామారావు ఉంటారు. ఆయన తర్వాత పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో పాటు పలువురు స్టార్స్ ఆ పాత్రలలో మెరిసాడు.
ఇప్పుడు అల్లు అర్జున్ కూడా దేవుడి పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్.. రుద్రమదేవి చిత్రంలో అతిథి పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్లోనే అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్. తమిళ వర్షెన్లో విజయ్ సేతుపతి దేవుడి పాత్రను చేయగా, ఇప్పుడు తెలుగులో బన్నీ చేయనున్నాడని సమాచారం.
అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించిన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని పీవీపీ సినిమా–శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రీమేక్ చేస్తున్నాయి. ఇందులో విశ్వక్ సేన్ ప్రధాన పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ పాత్రకు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది.