మంచిర్యాల టౌన్, డిసెంబర్ 12: మంచిర్యాల మున్సిపాలిటీని ఏళ్లుగా పీడిస్తున్న డంప్యార్డు సమస్యకు పరిష్కారం లభిస్తున్నది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిని ఆనుకుని ఉన్న హాజీపూర్ మండలం పోచంపాడ్ గ్రామశివారులో నాలుగెకరాల స్థలాన్ని కేటాయిస్తూ కలెక్టర్ బాదావత్ సంతోష్ అక్టోబర్లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు అధికారులు ఈ విషయాన్ని పక్కకు పెట్టారు. తాజాగా పోచంపాడ్ గ్రామంలోని సర్వేనంబర్-94లో మున్సిపాలిటీకి డంప్యార్డు కోసం కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అధికారులు సమాయత్తమయ్యారు. డంప్యార్డు పోచంపాడ్కు తరలిపోతే ఇక అండాళమ్మకాలనీ, గ్రీన్సిటీ, రంగంపేట ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇప్పటివరకు అండాళమ్మకాలనీలో ఉన్న డంప్ యార్డుతో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. కాగా.. అండాళమ్మకాలనీలో డంప్ యార్డుతో తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, నివాసాలకు దగ్గరగా ఉండడంతో దాని నుంచే వెదజల్లే దుర్వాసనతో రోగాలు వస్తున్నాయని.. పలుమార్లు సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆందోళనలు చేశారు.
ఈ ఏడాది జూలైలో డంప్యార్డుకు వెళ్లే మున్సిపల్ వాహనాలను అడ్డుకున్నారు. సమస్య తీవ్రరూపం దాల్చడంతో విషయాన్ని అదనపు కలెక్టర్ రాహుల్, అప్పటి ఎమ్మెల్యే దివాకర్రావు సీరియస్గా తీసుకున్నారు. డంప్యార్డుకు ఎలాగైనా స్థలాన్ని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి డంప్యార్డు సమస్యను తీసుకువెళ్లారు. దీంతో హాజీపూర్ మండలం పోచంపాడ్ గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలంలో నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. త్వరలోనే డంప్యార్డు సమస్యకు పరిష్కారం లభించనుంది. మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదోవార్డు అండాళమ్మ కాలనీలో 20 ఏళ్లక్రితం డంప్యార్డు ఏర్పాటుచేశారు. దీని నుంచి తీవ్ర దుర్వాసన రావడం, రాత్రివేళల్లో నిప్పంటుకుని పొగలు రావడంలాంటి అంశాలతో చుట్టు పక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పలువురు అనారోగ్యం బారిన పడిన సందర్భాలు ఉన్నాయి.
దీంతోపాటు డంప్యార్డుకు దగ్గరగా కొత్తగా నివాస ప్రాంతాలు ఏర్పడటం, అండాళమ్మ కాలనీ కూడా విస్తరించడం లాంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డంప్యార్డును ఇక్కడినుంచి తరలించాలన్న డిమాండ్ చాలా రోజులనుంచి ఏర్పడింది. గడిచిన ఏడాదిగా ఈ డిమాండ్ మరింతగా బలపడింది. గత జూలైలో వారం పాటు అండాళమ్మ కాలనీ నివాసితులు ఆందోళన ఉధృతం చేశారు. చెత్త బండ్లను అడ్డుకోవడం, డంప్యార్డులోనే కుటుంబాలతో సహా వచ్చి కూర్చోవడం, అధికారులను నిలదీయడంవంటివి చోటుచేసుకున్నాయి. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్ అండాళమ్మ కాలనీ వాసులలో కొందరిని సంప్రదించి వారిని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడకు చేరుకున్న అండాళమ్మ కాలనీ నివాసితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరో రెండు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా మరో ప్రాంతానికి డంప్యార్డును వేరే ప్రాంతానికి మారుస్తామని హామీ ఇచ్చారు. కాగా.. ప్రస్తుతానికి మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి రోజుకి 45 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. 60 వాహనాల్లో చెత్తను వార్డుల్లోనుంచి డంప్ యార్డుకు తరలిస్తున్నారు.