హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాకముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయంపై పెట్టిన ఖర్చుతో పోల్చితే ఒక ఏడాదిలోనే తాము అనేక రెట్లు ఎక్కువ ఖర్చు చేసినట్టు చెప్పారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్పై చర్చసందర్భంగా మాట్లాడుతూ.. జీడీపీ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉన్నదని తెలిపారు. వ్యవసాయాన్ని గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని చెప్పారు. ఎవుసానికి ఉచిత విద్యుత్తును ఇవ్వడమే కాకుండా 65 లక్షల మందికి రైతులకు రూ.10 వేల చొప్పున రైతుబంధు ప్రయోజనాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. రైతుబీమా ఇస్తున్నామని చెప్పారు. దాదాపు పది రాష్ర్టాలకు బియ్యం సరఫరా చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందని తెలిపారు. వరి వేయాలని చెప్తున్న కాంగ్రెస్, బీజేపీ వడ్లను కొనుగోలు చేయాలని కేంద్రానికి చెప్పలేకపోతున్నాయన్నారు. ఆయిల్పామ్ పంటను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేస్తున్నామని చెప్పారు.. రాష్ట్ర పురోగతిపై నిత్యం ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ ఉత్పత్తి-వ్యయం, రాష్ర్టానికి వస్తున్న ఆదాయ-వ్యయాలు, జలాశయాల్లో నీటి నిల్వలు.. తదిదర అంశాలను రోజూ ఉదయాన్నే చూసుకోవడం తన దినచర్యగా చేసుకున్నారని ప్రశంసించారు. టీఎంసీ అంటే తెలియనోళ్లు కూడా నీటి అంశంపై మాట్లాడటం శోచనీయమని కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. కొవిడ్ సమయంలో సీఎం కేసీఆర్ సోషల్ సైంటిస్టుగా వ్యవహరించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా తగిన ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల భర్తీకి కృషిచేస్తుంటే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కోర్టులకు వెళ్లి వాటిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నాయని వెల్లడించారు.