హైదరాబాద్, ఏప్రిల్ 23: ఏడాదికాలంగా మొక్కజొన్న ధర గణనీయంగా పెరిగినందున, మక్కలకు ప్రత్యామ్నాయంగా పౌల్ట్రీ దాణా తయారుచేసేందుకు.. మానవ వినియోగానికి పనికిరాని గోధుమ, ధాన్యం, నూకల్ని కనీసం 20 లక్షల టన్నుల మేర పరిశ్రమకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (నెక్) విజప్తి చేసింది. దేశీయ మార్కెట్లో మొక్కజొన్న, సోయామీల్ల కొరత ఏర్పడిందని, భారీగా ధరలు పెరిగాయని, పౌల్ట్రీ పరిశ్రమ చరిత్రలో ఇది పెద్ద సంక్షోభం అని నెక్ ఆవేదన వ్యక్తం చేసింది.
మక్కల ఎగుమతులు పెరగడం, వీటిని అధికంగా పండించే బిహార్లో బయో ఇంధనం తయారీకి వినియోగించడం వంటి వివిధ కారణాలతో మక్కల ధర టన్నుకు రూ.18 వేల నుంచి రూ.25 వేలకు పెరిగిందని, ఇది రూ.30 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు నెట్ వివరించింది. ఏడాది క్రితం గ్రుడ్డు ఉత్పత్తి వ్యయం రూ. 4 కాగా, మొక్కజొన్న ధర పెరుగుదలతో ఈ వ్యయం ప్రస్తుతం రూ.4.75-5కు చేరిందని, కానీ సగటు ఫామ్గేట్ ధర గ్రుడ్డుకు రూ.3.50 మాత్రమే ఉండటంతో పౌల్ట్రీ రైతులకు రూ.1.50-1.75 మధ్య నష్టం వస్తున్నదని తెలిపింది.
ఈ కారణంగా వేలాదిమంది చిన్న, సన్నకారు రైతులే కాకుండా, బ్రీడర్లు కూడా వారి ఫారాల్ని మూసివేయడమో, ఉత్పత్తిని తగ్గించడమో చేస్తున్నారని, ఎంతోమంది దివాలా అంచున ఉన్నారని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో మక్కలకు ప్రత్యామ్నాయంగా ఇతర చౌక ధాన్యాల్ని దాణాగా వినియోగించడం ఒక్కటే మార్గమని, పౌల్ట్రీ రైతుల మనుగడకు, వినియోగదారులకు అందుబాటు ధరలో గ్రుడ్లు, చికెన్ను అందించడానికి ఇది అవసరమని నెక్ పేర్కొంది.