ఎంఐ-17వీ5.. ప్రపంచంలోనే అత్యాధునిక రవాణా హెలికాప్టర్. ఇది ఎంఐ-8/17 రకానికి చెందిన మిలిటరీ రవాణా విమానం. రష్యన్ హెలిక్యాప్టర్స్కు చెందిన సబ్సిడరీ అయిన కజాన్ హెలికాప్టర్స్ దీనిని తయారుచేసింది. 2008లో భారత్తో 80 ఎంఐ-17వీ5 హెలికాప్టర్లను పంపిణీ చేసేందుకు రష్యాతో ఒప్పందం. 2011-13 మధ్య మొత్తం 36 హెలికాప్టర్ల డెలివరీ చేశారు. ఈ హెలికాప్టర్లను 60కి పైగా దేశాలు వినియోగిస్తున్నాయి.
న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రముఖులు, సైనికాధికారులు మరణించిన ఘటనలు గతంలో అనేకం చోటుచేసుకున్నాయి. 1997లో గుజ్రాల్ మంత్రివర్గంలో రక్షణశాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న ఎన్వీఎన్ సోము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్లో కూలిపోయింది. 1997 నవంబర్ 14న జరిగిన ఆ దుర్ఘటనలో మంత్రితో పాటు సీనియర్ సైనికాధికారి మేజర్ జనరల్ రమేశ్చంద్ర నాగ్పాల్, మరో ఇద్దరు సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. సీనియర్ సైనికాధికారులు మరణించిన చివరి హెలికాప్టర్ ప్రమాదం ఇదే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత 8 నెలలకు 2010 ఏప్రిల్ 30న అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండూ, మరో నలుగురు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న ఏపీలోని కృష్ణా జిల్లాలో కైకలూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.