పాట్నా: బీహార్లో జేడీయూ, బీజేపీ మధ్య బ్రేకప్ దాదాపు ఖాయమైంది. సీఎం నితీశ్ కుమార్ మరికాసేపట్లో గవర్నర్ ఫాగు చౌహాన్ను కలవనున్నారు. ఓ భారీ న్యూస్ను పేల్చనున్నట్లు ఆ పార్టీ నేత ఇవాళ ప్రకటించారు. ఇక మరో వైపు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న 16 మంది బీజేపీ మంత్రులు రాజీనామా చేయనున్నారు. బీజేపీ మంత్రులు కూడా గవర్నర్ ఫాగూ చౌహాన్తో భేటీకానున్నారు. బీజేపీ నేతలందరూ ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం తర్కిషోర్ ప్రసాద్ను కలిశారు. అయితే నితీశ్ ఏదైనా ప్రకటించిన తర్వాతే తాము రాజీనామా నిర్ణయంపై ఆలోచిస్తామని ఓ బీజేపీ నేత తెలిపారు.
జనతాదళ్ను చీల్చేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా నిర్విరామంగా పనిచేస్తున్నారని సీఎం నితీశ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, జేడీయూ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. తమ పార్టీకి చెందిన ఆర్సీపీ సింగ్.. అమిత్ షాకు సమాచారాన్ని చేరవేస్తున్నాడని నితీశ్ ఆరోపించారు. ఆర్సీపీ సింగ్ వారం క్రితమే జేడీయూను వీడారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన ఆ పార్టీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆర్సీపీ సింగ్ వల్ల జేడీయూ మునిగిపోతున్నట్లు నితీశ్ ఆరోపించారు.