లక్నో: ఎన్నికల్లో పోటీకి సంబంధించి యూపీ సీఎం యోగి అదిత్యనాథ్కు చాయిస్ ఇవ్వకుండా గోరఖ్పూర్కు పంపడం ద్వారా బీజేపీ ఆయనకు ఫేర్వెల్(వీడ్కోలు) ఇచ్చిందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. సీఎంగా ఉన్న వ్యక్తి తన ఎంపికకు అనుగుణంగా టికెట్ను తెచ్చుకోలేకపోయారని అన్నారు. ‘ఆయోధ్యలో పోటీచేస్తే ప్రజలు యోగికి వీడ్కోలు పలుకుతారని కొంతమంది సాధువులు, ఇతరులు చెబుతున్నారు. అయితే గోరఖ్పూర్కు పంపండంతో బీజేపీ ఇప్పటికే ఆయనకు ఫేర్వెల్ ఇచ్చింది’ అని అన్నారు. యోగి గోరఖ్పూర్ నుంచి బరిలో ఉండటంతో 2002 నుంచి ఇక్కడ బీజేపీ తరపున వరుసగా గెలుస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాధామోహన్ అగర్వాల్ పరిస్థితి ఏంటనే దానిపై చర్చ నడుస్తున్నది.
ఈ నేపథ్యంలో అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాధామోహన్కు ఎస్పీ టికెట్ను ఆఫర్ చేశారు. యోగిపై పోటీకి టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘మీరు అగర్వాల్ను సంప్రదించి మాట్లాడగలిగితే, టికెట్ను అతనికి కేటాయిస్తాం’ అని విలేకర్లతో పేర్కొన్నారు. అయితే దీనిపై అగర్వాల్ స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉన్నది.