న్యూఢిల్లీ, జూలై 28: కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంపై సమాజ్వాదీపార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాన్ను తొలగించడం ద్వారా ప్రధాన మంత్రిని ప్రభుత్వం కాపాడుకుందని ఆయన వ్యాఖ్యానించారు. లోక్సభలో పేపర్ లీక్ నివారణ(సవరణ) బిల్లు, 2026పై 10 గంటల చర్చలో పాల్గొన్న అఖిలేశ్ నీట్ ప్రశ్నపత్రం లీకేజ్పై దేశవ్యాప్తంగా రేకెత్తిన నిరసనలకు ప్రధాని రాజీనామాకు ముడిపెట్టారు.
ప్రజల ఒత్తిడికి ప్రభుత్వం తలవంచాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి (ధరేంద్ర ప్రధాన్) పార్లమెంట్కు వచ్చినపుడు సభ బయట ఆయనకు స్వాగతం లభించింది. సభ్యులు ఎంత గొప్ప ఉపశమనాన్ని పొంది ఉంటారో, అలాగే వారు ఎంతటి తీవ్ర సంక్షోభం నుండి రక్షించబడ్డారో ఒక్కసారి ఊహించుకోండి. ఒక ప్రధాన్ను తొలగించడం ద్వారా మీరు వాస్తవానికి ప్రధాన మంత్రిని కాపాడారు అంటూ అఖిలేశ్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యా శాఖకు రాజీనామా చేసిన మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బీజేపీ వర్గాలు బహిరంగంగా సన్మానించడం పట్ల పార్లమెంట్లో రాజకీయ వివాదం చెలరేగింది. ఒక సూపర్ స్టార్లా, పాకిస్థాన్ యుద్ధం నుంచి తిరిగి వచ్చిన వీరుడిలా ఆయనకు సన్మానం జరిగిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత పార్లమెంట్కు వచ్చిన ఆయనకు బీజేపీ సభ్యులు శాలువా కప్పి, సంప్రదాయ టోపీతో అలంకరించి ‘ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్’ నినాదాలతో సభలోకి తీసుకురావడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు.
పార్లమెంట్లో మంగళవారం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేపర్ లీక్ ఆరోపణల్లో పదవికి రాజీనామా చేసిన వ్యక్తికి ఇలా స్వాగతం పలకడం అవమానమని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్తో యుద్ధం చేసి వచ్చిన వీరుడిలా ప్రధాన్కు స్వాగతం పలికారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నియమితులైన ప్రహ్లాద్ జోషిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చేసిన సంచలన వ్యాఖ్యలు మంగళవారం లోక్సభలో తీవ్ర రభసకు దారితీశాయి. ప్రభుత్వ పరీక్షల్లో అక్రమ పద్ధతుల నివారణ(సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా లోక్సభలో ప్రియాంక మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్పై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ కాల్పులకు ఎవరు ఆదేశించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక గర్భిణిపై అత్యాచారానికి పాల్పడిన రేపిస్టులు జైలు నుండి విడుదల కావడాన్ని సమర్థించిన వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించారు అంటూ ప్రియాంక విమర్శించారు. ఆమె వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రిజిజు, బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే, ప్రహ్లాద్ జోషి తీవ్ర నిరసన తెలిపారు.
ప్రియాంక తను చేసిన ఆరోపణలకు సాక్ష్యం చూపాలని, లేనిపక్షంలో క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కాగా పార్లమెంట్ బయట కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా కొత్తగా నియమితులైన ప్రహ్లాద్ జోషిపై విరుచుకుపడ్డారు. జోషిని అత్యంత నీచమైన మనిషిగా అభివర్ణిస్తూ అత్యాచార నిందితులను రక్షిస్తున్నారని ఆయన ఆరోపించారు. 2002 నాటి బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సమర్థిస్తూ జోషి చేసిన వ్యాఖ్యలను రాహుల్ పరోక్షంగా ప్రస్తావించారు.
నిరసన తెలియచేస్తున్న విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్లను వాడినందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మంగళవారం రాజ్యసభలో విపక్ష సభ్యులు తమ నిరసన తీవ్రం చేశారు. దీంతో సభ ఎటువంటి కార్యకలాపాలు జరగకుండానే వాయిదా పడింది. మంగళవారం సభ కేవలం ఉదయం సెషన్లో ఏడునిమిషాలు, మధ్యాహ్నం సెషన్లో మూడు నిమిషాలు మాత్రమే సమావేశమైంది.