ముంబై: మహారాష్ట్రలో కొవిడ్-19 నిబంధనలను ప్రజలు ఉల్లంఘించడం కొనసాగిస్తే ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం మినహా మరో మార్గం లేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెచ్చరించారు. మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గురువారం ఏకంగా 31,000 తాజా కేసులు బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. పుణేలో కరోనా వైరస్ వ్యాప్తిపై సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం అజిత్ పవార్ మాట్లాడుతూ హోలీ వేడుకల సందర్భంగా కఠిన నియంత్రణలు విధించామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా హోలీ వేడుకల్లో పెద్దసంఖ్యలో ప్రజలు ఒకే చోట గుమిగూడటం అనుమతించబోమని స్పష్టం చేశారు. కఠిన లాక్డౌన్లను నివారించాలంటే ప్రజలు కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించే నిబంధలను విధిగా అనుసరించాలని హెచ్చరించారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా హాట్స్పాట్స్లో కఠిన లాక్డౌన్లు తప్పవని అజిత్ పవార్ స్పష్టం చేశారు. పాజిటివ్ కేసులు ఇలాగే పెరిగితే లాక్డౌన్ మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఈ భేటీకి హాజరైన అధికారులు, వైద్య నిపుణులు సహా పలువురు ప్రతినిధులు అభిప్రాయపడ్డారని చెప్పారు.