జెరూసలేం: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval ) ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో సమావేశమయ్యారు. గతకొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, గాజాకు మనవతా సహాయ అందించడంపై ఇరువురు నేతలు చర్చించారు. గాజా స్ట్రిప్లో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దోవల్ కలిసి ఉన్న ఫొటోలను ఎక్స్లో షేర్ చేశారు. కాగా, ఆహార అభద్రను ఎదుర్కొంటున్న గాజాకు మనవాతా సహాయం సమస్యను పరిష్కరించే అంశాన్ని తక్షణమే పరిశీలించాలని కోరినట్లు తెలుస్తున్నది.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 30 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్కు చెందిన 1200 మంది మృతించారు. హమాస్ తుదముట్టించడమే లక్ష్యంగా గ్రాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతుండటంతో అక్కడి నుంచి సుమారు 5 లక్షల 76 వేల మంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. అదేవిధంగా గాజాను నెతన్యాహూ సైన్యం దిగ్భందించడంతో అక్కడి ప్రజలు నిత్యావసరాల కొరత ఎదుర్కొంటున్నారు. ఆహార సంక్షోభం ఏర్పడటంతో ప్రజలు ఇతర దేశాలపై సహాయం కోసం చూస్తున్నారు.