న్యూఢిల్లీ, నవంబర్ 22: టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ టారీఫ్లను భారీగా పెంచుతున్నది. వివిధ రకాల ప్లాన్ల చార్జీలు 20 నుంచి 25 శాతం పెరుగుతాయని సోమవారం ప్రకటించింది. కొత్త ధరలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే కనీస ప్లాన్ రూ.49ని రూ.79కి పెంచిన ఎయిర్టెల్.. ఇప్పుడు దాన్ని రూ.99గా మార్చింది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ల ప్లాన్ల ధరల్నీ కాలపరిమితి ఆధారంగా కనిష్ఠంగా రూ.30 నుంచి గరిష్ఠంగా రూ.501 వరకు పెంచింది. డాటా టాప్-అప్స్ ధరల్నీ రూ.10 నుంచి రూ.50 వరకు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎయిర్టెల్కు దాదాపు 32.3 కోట్ల మంది కస్టమర్లున్నట్లు అంచనా. మొబైల్ యావరేజ్ రెవిన్యూ పర్ యూజర్ (ఏఆర్పీయూ) రూ.200 ఉండాల్సిన అవసరం ఉన్నదని, రూ.300 ఉంటేనే సంస్థల వ్యాపారం బాగుంటుందని ఈ సందర్భంగా ఎయిర్టెల్ తెలిపింది. అప్పుడే మరిన్ని పెట్టుబడులకు వీలుంటుందని, 5జీ విస్తరణకూ మెరుగైన అవకాశాలుంటాయన్నది. సెప్టెంబర్ నాటికి సంస్థ ఏఆర్పీయూ రూ.153గా ఉన్నది. ప్రభుత్వ బకాయిలతో టెలికం రంగంపై ఉన్న అధిక ఒత్తిడి నేపథ్యంలో టారీఫ్లను పెంచాల్సిన అవసరం ఉన్నదని ఇదివరకే ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, ఎయిర్టెల్ పెంపుతో వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సైతం తమ టారీఫ్లను పెంచే అవకాశాలున్నాయి. మరోవైపు ప్లాన్ చార్జీల పెంపు ప్రకటన నేపథ్యంలో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎయిర్టెల్ షేర్లు పెద్ద ఎత్తున పుంజుకున్నాయి. ఒక్కో షేర్ విలువ దాదాపు 4 శాతం లాభపడింది. బీఎస్ఈలో 3.90 శాతం ఎగిసి రూ.742.05 వద్ద ఉండగా, ఒకానొక దశలో 52 వారాల గరిష్ఠాన్ని తాకుతూ రూ.756కు చేరింది. నిఫ్టీలోనూ 3.88 శాతం ఎగబాకి రూ.742.10 వద్ద స్థిరపడింది.