Air Pollution | రోజురోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం పర్యావరణ సమస్య మాత్రమే కాదు ఇది పెరుగుతున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితి అని నిపుణులు పేర్కొంటున్నారు. నిరంతరం దగ్గు నుండి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి వరకు కలుషితమైన గాలి మన శ్వాసకోశ వ్యవస్థను నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. ప్రపంచంలోని 100 అత్యంత కలుషిత నగరాల్లో 92 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి. ఈ జాబితాలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 99 శాతం మంది ప్రజలు భద్రతా ప్రమాణాలు సూచించిన దాని కంటే కలుషిత గాలిని పీల్చుకుంటున్నారు. దీంతో పర్యావరణ కాలుష్యం శ్వాసకోశ వ్యవస్థ పనితీరు దెబ్బతినడానికి ప్రధాన కారకంగా మారింది. కాలుష్య కారకాలు పరిమితిని దాటడం, పీల్చే కణ పదార్థం, రసాయనాలు వాయు నిర్మాణ మార్గానికి దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తాయి.
దహన ఉత్పన్న లోహాలు, సేంద్రీయ కార్బన్ కణాలు ఊపిరితిత్తుల కణజాలంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. ఇవి అల్వియోలీ, రక్తనాళాల మధ్య సన్నని అవరోధాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో దీర్ఘకాలిక మంట, అసాధారణ కణాల పెరుగుదలతో పాటు ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది. పొగమంచు కారణంగా ఆస్తమా దాడులు పెరుగుతాయి. సూక్ష్మకణాలు వాయు మార్గాలను ఇరుకు చేస్తాయి. దీంతో దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాయు కాలుష్యానికి గురి కావడం వల్ల ధూమపానం చేయని వారిలో కూడా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వేగవంతంగా వస్తుంది. దీంతో ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వాయు కాలుష్యం కారణంగా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని అంతేకాకుండా ఎక్కువగా మరణాలు హృదయ సంబంధ కారణాలతో ముడిపడి ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులే దెబ్బతింటాయని చాలా మంది భావిస్తారు కానీ ఇది మొత్తం శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. రక్తపోటు, రక్తహీనత, పుసరుత్పత్తి సమస్యలు, చర్మం, జీర్ణ సమస్యలు ఇలా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. అనేక వాయు కాలుష్య సంబంధిత రుగ్మతలు నిశ్శబ్దంగా అభివృద్ది చెందుతాయి. కనుక ఛాతీ ఎక్స్ రేలు, సిటి స్కాన్స్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. అధిక వాయు కాలుష్యానికి గురి అయ్యే వారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల హాని ఎక్కువగా కలగకుండా ఉంటుంది. అలాగే వాయుకాలుష్యానికి గురి అయ్యే వారు శ్వాసకోశ రక్షణ పరికరాలను వాడడం మంచిది. దీని వల్ల నష్టం తగ్గుతుంది. ఇంట్లో ఎయిర్ క్వాలిటీని పరీక్షించుకోవడం, ఎన్95 లేదా ఎన్99 మాస్క్ లను వాడడం, ఫూర్యిఫైయర్ లను ఉపయోగించడం వంటి పద్దతులను పాటించాలి. ఇలా చేయడం వల్ల వాయుకాలుష్యం కారణంగా ఊపిరితిత్తులకు, మొత్తం శరీరానికి కలిగే నష్టం తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.