న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. దీంతో అక్కడ ఉన్నవాళ్లకు జీవితకాలం పదేళ్లు తగ్గుతున్నట్లు అమెరికా పరిశోధనా సంస్థ అంచనా వేసింది. ఇక ఇప్పుడున్న వాయు నాణ్యత స్థాయిలను బట్టి భారతీయుల సగటు జీవిత కాలం అయిదేళ్లు తగ్గినట్లు ఆ స్టడీ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 130 కోట్ల మంది భారతీయులు ప్రమాదకర వాయు కాలుష్యంలోనే జీవిస్తున్నట్లు రిపోర్ట్ తెలిపింది. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో జనం వాయు కాలుష్యం వల్ల చనిపోతున్నట్లు స్టడీ చెప్పింది. చికాగో వర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్సిటిట్యూట్ ఈ నివేదికను తయారు చేసింది. ప్రస్తుతం 51 కోట్ల మంది ఉత్తర భారతంలోనే నివసిస్తారని, అంటే దాదాపు 40 శాతం జనాభా వాయు కాలుష్యం వల్ల తమ జీవిత కాలంలో కనీసం 7.6 ఏళ్ల జీవితాన్ని కోల్పోతున్నట్లు రిపోర్ట్ తెలిపింది.
2013 నుంచి ప్రపంచవ్యాప్తంగా 44 శాతం కాలుష్యం ఇండియాలో నుంచి వస్తోందని చికాగో వర్సిటీ తన స్టడీలో తెలిపింది. ప్రస్తుతం కలుషిత దేశాల్లో ఇండియా రెండవ స్థానంలో ఉంది. భారత్లో వాయు నాణ్యత 40µg/m³గా ఉంటే దాన్ని సురక్షితంగా భావిస్తారు. కానీ 63 శాతం మంది భారతీయులు ఆ స్థాయి నాణ్యత లేని వాతావరణంలో ఉంటున్నారు. 2019 లెక్కల ప్రకారం ఇండియాలో వాయు నాణ్యత 70.3µg/m³గా ఉందని స్టడీలో తెలిపారు.
పార్టికులేట్ పొల్యూషన్ వల్ల మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడిందని, ఇది మనిషి సగటు జీవితంపై ప్రభావం చూపుతోందని, 1998 నుంచి పార్టికులేట్ పొల్యూషన్ 61.4 శాతం పెరిగిందని పరిశోధకులు తెలిపారు. ఇది స్మోకింగ్ కన్నా డేంజర్ అని, స్మోకింగ్తో పోలిస్తే 2.5 ఏళ్లు తగ్గినట్లు అవుతుందని స్టడీ వెల్లడించింది. గడిచిన రెండు దశాబ్దాల్లో ఇండియా పారిశ్రామీకరణ విపరీతంగా పెరిగిందని, దీని వల్ల వాయు కాలుష్యం పెరిగినట్లు అంచనా వేశారు. వాహనాల సంఖ్య కూడా నాలుగింతలు పెరిగినట్లు చెబుతున్నారు.