న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు, కూల్చివేతల కార్యకలాపాలపై నిషేధాన్ని ప్రభుత్వం పొడగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిషేధం అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్రాయ్ సోమవారం తెలిపారు. ట్రక్కుల ప్రవేశంపై నిషేధం, అవసరమైన వాటిని మినహాయించి డిసెంబర్ 7 వరకు కొనసాగుతుందని, సీఎన్జీ, ఎలక్ట్రికల్ ట్రక్కులు ఢిల్లీలో ప్రవేశానికి అనుమతించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఢిల్లీ గాలి నాణ్యత చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
భారత వాతావరణశాఖ నిపుణులు పేర్కొన్నారు. అయితే, వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగా వర్షాలు కురిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఢిల్లీలో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధాన్ని పొడగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్లంబింగ్ వర్క్, ఇంటీరియర్ డెకరేషన్, ఎలక్ట్రిక్ వర్క్, కార్పెంటరీ కాలుష్య రహిత నిర్మాణ కార్యకలాపాలకు ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘రెడ్లైట్ ఆన్ – గాడి ఆఫ్’ కార్యక్రమాన్ని డిసెంబర్ 18 వరకు పొడగిస్తున్నట్లు మంత్రి చెప్పారు.