న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా సంస్థ ఓ భారీ డీల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. సుమారు 300 విమానాలను కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ సిద్ధమైనట్లు కొన్ని వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. కమర్షియల్ ఏవియేషన్ చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద డీల్ అని భావిస్తున్నారు. కానీ ఈ డీల్కు సంబంధించిన వివరాలను ఇంకా గోప్యంగా ఉంచారు. ఇటీవల ఎయిర్ ఇండియాకు కొత్త ఓనర్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన విమానాల సంఖ్యను భారీగా పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే సుమారు 300 కొత్త విమానాలను ఖరీదు చేసేందుకు ఎయిర్ ఇండియా సిద్ధమైనట్లు అంచనా వేస్తున్నారు.
ఎయిర్బస్ ఎస్ఈ ఏ320నియో ఫ్యామిలీకి చెందిన జెట్ విమానాలను లేదా బోయింగ్ 737 మ్యాక్స్ మోడళ్లను ఎయిర్ ఇండియా ఖరీదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఈ అంశాన్ని రహస్యంగానే ఉంచినట్లు కొన్ని వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. 300 బోయింగ్ 737 విమానాలను ఖరీదు చేస్తే, ఆ విలువ సుమారు 40.5 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ 300 విమానాలకు సంబంధించిన ప్రొడక్షన్, డెలివరీ కావడానికి కనీసం ఓ దశాబ్ద సమయం పడుతుంది. ప్రతి నెలలో ఎయిర్బస్ సంస్థ కేవలం 50 విమానాలను తయారు చేస్తుంది. అయితే 203 నాటికి ఆ సంఖ్యను 65కు పెంచనున్నది. 2025 నాటికి అది 75 కానున్నట్లు తెలుస్తోంది.
ఎయిర్బస్, బోయింగ్, ఎయిర్ ఇండియా కంపెనీలు ఈ అంశంపై కామెంట్ చేసేందుకు నిరాకరించాయి.