ముంబై, ఫిబ్రవరి 21: బ్యాంకుల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుండటంతో బంగారంపై రుణాలిచ్చే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్తకొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తున్నాయి. మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు దూకుడుగా వ్యవహారించాలని ఎన్బీఎఫ్సీలు నిశ్చయించుకున్నట్టు ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ సోమవారం విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొన్నది. కరోనా దెబ్బతో రుణాలు చెల్లించనివారి బంగారాన్ని పెద్ద ఎత్తున ఎన్బీఎఫ్సీలు వేలం వేయడం కూడా వీటి వ్యాపారావకాశాల్ని కొంత మేర ప్రభావితం చేసిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మార్కెట్ ఆకర్షక వ్యూహాలకు ఆయా సంస్థలు పదును పెట్టాయి.
ఒకప్పుడు బంగారంపై రుణాలపట్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో ఎన్బీఎఫ్సీలు, ముఖ్యంగా ప్రైవేట్ రంగ సంస్థలదే హవా. అయితే గతకొంత కాలంగా బ్యాంకులు బంగారంపై రుణాలను భారీగా ఇస్తున్నాయి. వడ్డీరేట్లనూ ఆకర్షణీయంగా నిర్ణయిస్తున్నాయి. ఇది ఎన్బీఎఫ్సీల మార్కెట్ను ప్రభావితం చేస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) బ్యాంకుల గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో రూ.60,700 కోట్లుగా ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్) రూ.70,900 కోట్లుగా ఉండటం గమనార్హం.
వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం లాభాలనూ తగ్గించుకునేందుకు ఎన్బీఎఫ్సీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే తక్కువ వడ్డీరేట్లకే రుణాలంటూ ఆఫర్లిస్తున్నాయి కూడా. ప్రధానంగా లక్షల రూపాయల్లో తీసుకునే భారీ రుణాలపై చౌక వడ్డీరేట్లనే ప్రకటిస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర చార్జీలనూ పక్కనపెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. నిబంధనలనూ సడలించి క్షణాల్లో రుణాలను మంజూరు చేస్తున్నాయి. గ్రాముపై అధిక రుణ మొత్తాన్నీ అందిస్తున్నాయి.