రైతులు సంప్రదాయ సాగుకు క్రమేణా స్వస్తి చెబుతున్నారు. వాణిజ్య పంటల్లో మార్కెటింగ్ సమస్యలు, పెట్టుబడి వ్యయం పెరగడంతో రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే పంటలవైపు దృష్టి పెడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారం గ్రామానికి చెందిన ఆదిరెడ్డి.. కేవలం అర ఎకరంలో పుదీనా సాగు చేసి, అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాడు.
పక్కా ప్రణాళికతో..
ఆదిరెడ్డి అర ఎకరంలో 32 మడులను ఏర్పాటు చేశాడు. నెలవారీ ప్రణాళికను రూపొందించుకొని.. మొక్కలు నాటాడు. రోజుకొక మడి చొప్పున పుదీనాను కోసి, 700 కట్టలు కట్టి స్థ్దానిక మార్కెట్కు పంపిస్తున్నాడు. దీంతో ప్రతిరోజూ రూ. 600 నుంచి రూ.700ల వరకు సంపాదిస్తున్నాడు. పుదీనా సాగు కోసం భూమిని కల్టివేటర్తో కలియ దున్నించి, గుంటుకతో సమానంగా చేశాడు. దుక్కి దున్నేటప్పుడే డీఏపీ, నాలుగు ట్రాక్టర్ల పశువుల ఎరువు వేశాడు.
పంటను 32 మళ్లుగా చేసి, మొక్కలు నాటాడు. 45 రోజులకు మొదటి పంట కోతకు వచ్చిందని రైతు ఆదిరెడ్డి చెబుతున్నారు. ఒక్కసారి మొక్కలు నాటితే.. కనీసం రెండేండ్ల వరకు పుదీనా పంట ఆదాయాన్ని అందిస్తుందని తెలిపాడు. ఏడాదికి 8 సార్లు పుదీనాను కోసి, మార్కెటింగ్ చేయవచ్చు. మొక్కలకు చీడ పీడలు ఆశించినట్లయితే, వాటిని తొలగించి.. తిరిగి కొత్త మొక్కలు నాటుతున్నాడు. ఇలా ఆదాయంలో ఎలాంటి లోటు లేకుండా మంచి లాభాలు పొందుతున్నాడు.
ఖర్చులు పోనూ..
నేను కేవలం అర ఎకరంలోనే పుదీనా సాగు చేస్తున్నా. నెలకు రూ. 20వేల దాకా సంపాదిస్తున్నా. ఖర్చులు పోను కనీసం రూ. 15 వేల వరకూ మిగులుతున్నాయి. కోత కోసిన తరువాత పుదీనా మొక్కలకు కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నా. చీడ పీడల నివారణ కోసం 15 రోజులకు ఒకసారి మందులు పిచికారీ చేస్తున్నా.
– ఆదిరెడ్డి, రైతు.
…? గజ్జ సారేశ్వర్ రావు