హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పుల నేపథ్యంలో పంటల సరళి, వాటర్షెడ్లపై అధ్యయనం చేసేందుకు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ), ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందం కుదిరింది. పంటల ఉత్పాదకత పెంపుదలకు వాటర్షెడ్ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై అధ్యయనం చేయనున్నారు. శుక్రవారం రాజేంద్రనగర్లో ఎన్ఐఆర్డీ డీజీ నరేంద్రకుమార్, వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సుధీర్కుమార్ ఒప్పందపత్రాలను మార్చుకొన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖలు సంయుక్తంగా పనిచేస్తే ఆశించిన లక్ష్యాలు చేరుకోగలమని నరేంద్రకుమార్ పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, బిగ్డాటా, డ్రోన్ల వినియోగం, డిజిటలీకరణ వైపు వ్యవసాయం అడుగులు వేస్తున్నదని వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ
ప్రవీణ్రావు చెప్పారు.