ఏడేండ్లలో.. పంజాబ్ నుంచి 1,131 లక్షల టన్నులు
తెలంగాణ నుంచి 485 లక్షల టన్నులు
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారం చెలాయించిన రాజకీయ పార్టీలకు మొదట్నుంచీ దక్షిణాదిపై చిన్నచూపే. ముఖ్యంగా నాడు ఆంధ్రప్రదేశ్.. నేడు తెలంగాణపై అదే వివక్ష. నాడు కాంగ్రెస్ అయినా.. నేడు బీజేపీ అయినా పాలకులు మారారే తప్ప వివక్ష ఎంతమాత్రం తగ్గనే లేదు సరికదా.. మరింతగా క్షోభ పెట్టే స్థితికి చేరుకొన్నది. ఇందుకు మన రైతులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అనుసరిస్తున్న విధానమే తార్కాణం. ఓ పక్క పంజాబ్లో నూటికి నూరుశాతం ధాన్యాన్ని కొంటున్న కేంద్రం.. తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి పనికిమాలిన కొర్రీలు పెడుతూ.. నానా ఇబ్బందులకు గురిచేస్తున్నది. అసలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనాకష్టం పడి పంటకు నోచుకోక.. పడావు పెట్టిన భూముల్లో.. స్వరాష్ట్రం వచ్చిన పుణ్యమా అని.. నీళ్లొచ్చి.. పెట్టుబడి వచ్చి.. ధైర్యమొచ్చి.. పెద్ద ఎత్తున ధాన్యం పండించుకొంటుంటే.. రా రైస్ అనీ.. బాయిల్డ్ రైస్ అనీ.. చెప్పినంత పంట పండటంలేదని రకరకాల కారణాలు చెప్తూ గోసపుచ్చుకొంటున్నది. పంజాబ్లో ఏటా కోటిన్నర టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్న కేంద్రం.. తెలంగాణలో ఇప్పుడిప్పుడే కుదురుకొని పండుతున్న పంటను సేకరించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడంలేదు. రైతు ఎక్కడైనా రైతే.. పంజాబ్ రైతు.. తెలంగాణ రైతు అని వేరుగా ఉండరు.. ఇద్దరూ మట్టిలో దిగి నేల తల్లి ఒడిలో వ్యవసాయం చేసేవారే. కేంద్రప్రభుత్వమే రైతులను విభజించి చూస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంజాబ్ రాష్ట్రం నుంచి ఎఫ్సీఐ ప్రతియేటా భారీ మొత్తంలో ధాన్యం సేకరిస్తున్నది. కోట్లకు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినా కొర్రీలు పెట్టడంలేదు. ఫలానా షరతులకు ఒప్పుకొంటేనే కొంటాం.. మీ రైతులను వేరే పంటలు వేసుకోమనండి.. బయట మార్కెట్లో అమ్ముకోమనండి.. అంటూ షరతులు పెట్టడం లేదు. పంజాబ్లో గత ఏడేండ్లలో దాదాపు 1,132 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే.. తెలంగాణలో అందులో 40 శాతం కూడా సేకరించలేదు. దక్షిణాది రాష్ర్టాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుకు ఈ ఒక్క తార్కాణం చాలు.
కేంద్రం ధాన్యం సేకరణకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏకరీతిన ఒక ప్రత్యేకమైన విధానమంటూ ఏదీ లేదు. మా దగ్గర ఇంత పండుతున్నది.. మీరు కొనండి అంటూ రాష్ర్టాలు లేఖలు రాస్తే.. కేంద్ర వ్యవసాయశాఖ ఉపగ్రహం నుంచి బొమ్మలు తెప్పించుకొని.. మీ దగ్గర ఇంతే పండింది.. మేము ఇంతే కొంటాం అంటూ ఖరారుచేస్తుంది. మేం క్షేత్రస్థాయిలో అంగుళమంగుళం తిరిగి తిరిగి లెక్కలు వేసి మీకిచ్చాం బాబూ.. అంటే మా బొమ్మలు ఇంతే చెప్తున్నాయంటారు. మేం హెలికాప్టర్ ఇచ్చి మిమ్మల్ని తీసుకుపోయి చూపిస్తామన్నా వినరు. పోనీ మీరు ఎంత కొంటే అంతే పంట వేసుకొంటాం.. అదైనా చెప్పండి అన్నా వాళ్లకు చీమ కుట్టినట్టన్నా ఉండదు. అదే పంజాబ్ రాష్ర్టానికి వచ్చేసరికి ఇవేమీ గుర్తుకురావు.. లెక్కలు వేయరు. ఎంత పంటైనా వేయనీయండి.. అంతా కొనేస్తారు. క్షణాల్లో డబ్బులూ విడుదల చేసేస్తారు.
ధాన్యం సేకరణలో నియమ నిబంధనలు అనేవి రైతుకు మేలు చేసేలా ఉండాలే కానీ.. నష్టం చేసేలా ఉండొద్దనేది నిపుణులు అభిప్రాయం. కానీ కేంద్రం మాత్రం రైతుల బాగోగులను గాలికొదిలేసి కేవలం నిబంధనల పేరుతో వారిని ఆగమాగం చేస్తున్నది. తెలంగాణలో శీతోష్ణస్థితిని అనుసరించి రెండు సీజన్లలో పండే ధాన్యంలో నూక శాతం హెచ్చుతగ్గులుంటాయి. రైతులకు మేలు కలుగాలంటే ఈ హెచ్చుతగ్గుల విషయంలో పట్టు విడుపులు అవసరమని నిపుణులు అంటున్నారు. 70 శాతం వ్యవసాయ ఆధారిత దేశంలో ప్రభుత్వాలు రైతుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలే తప్ప బాధలు పెట్టరాదని వారంటున్నారు. అవసరమైతే నూకశాతాన్ని మరో 10-15 శాతం పెంచైనా సేకరించాలని సూచిస్తున్నారు. సేకరించిన ధాన్యాన్ని సమర్థంగా వినియోగించడానికి అనేక ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయని.. కేంద్రం వాటి వైపు దృష్టి సారించాలంటున్నారు.
దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఇందులో భాగంగానే నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాల్లో భాగంగానే ధాన్యం కొనుగోళ్ల నుంచి తప్పుకొనేందుకు పన్నాగం పన్నుతున్నది. ధాన్యం నిల్వలు ఎక్కువయ్యాయని కొనుగోలుకు నిరాకరిస్తున్న ఎఫ్సీఐ, కేంద్రం.. అందుకు ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నాయి? ఉన్నట్టుండి ఒకేసారి ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పడం తెలంగాణ
రైతాంగానికి పెద్ద నష్టం. దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో మాట్లాడి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.
నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు
కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టి రైతు సంక్షేమం కోసం ఆలోచించాలి. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలి. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఎగుమతులపై ప్రణాళిక రూపొందించుకోవాలి.
ప్రొఫెసర్ జలపతిరావు, వ్యవసాయ శాస్త్రవేత్త