న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:డ్రోన్లు జనజీవితంలో భాగమైపోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వాటి ప్రాముఖ్యత పెరిగింది. పంటల సేద్యానికి ఉపయోగించే డ్రోన్లకు ఓ చక్కని పేరు సూచించాల్సిందిగా నెటిజనులను పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కోరారు. ట్విట్టర్లో ఆయన చేసిన ఈ విజ్ఞప్తిని త్వరలో మహీంద్రా సంస్థ నుంచి వ్యవసాయ డ్రోన్ రాబోతున్నదనడానికి సూచనగా భావిస్తున్నారు. పరిశోధన, రక్షణ, భద్రతా రంగాల కోసం తప్ప ఇతర అవసరాలకు డ్రోన్ల దిగుమతిని కేంద్రం నిషేధించిన మరుసటిరోజే ఆయన ఈ ట్వీట్ పోస్టు చేయడం ఊహాగానాలకు దారితీసింది. డ్రోన్-ఆచార్య అనే పేరు మాత్రం వద్దని ఆయన అన్నారు. ఆ పేరు రక్షణ రంగం డ్రోన్లకు బాగుంటుందని పేర్కొన్నారు. హరిత యోధులకు చక్కటి ముద్దుపేరును సూచించమని మహీంద్రా నెటిజనులకు పిలుపునిచ్చారు. పురుగుమందులు చల్లడం వంటి సాగుపనులకు డ్రోన్లను ఉపయోగిస్తున్న వీడియోలను ఆయన ఈ పోస్టుకు జతచేశారు. ఒక నెటిజన్ ‘డ్రోనగిరి’ (డ్రోన్ ప్లస్ అగ్రి) అని సూచించగా మరొకరు ‘హరిత్ ఉడాన్’ అనే పేరు సూచించారు.