హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ పార్టీదే అధికారం.. ఈ మాటేదో టీఆర్ఎస్కు చెందిన నేతలు, కార్యకర్తలు అన్నది కాదు. అసెంబ్లీ సాక్షిగా, అదీ.. వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలివీ. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో మాట్లాడుతూ.. మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. భారీఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో రాష్ట్రంలో ఆనందం నెలకొన్నదని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చను అక్బరుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో తలసరి ఆదాయం రూ.1.25 లక్షలుండగా, ఇప్పుడు రూ.2.72 లక్షలకు పెరిగిందని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలను రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచడాన్ని, రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తున్నామని వెల్లడించారు. ఆసరా పింఛనుదారుల వయసును 57 ఏండ్లకు తగ్గించటంతో 3.03 లక్షలున్న దరఖాస్తులు 7.80 లక్షలకు పెరిగాయని తెలిపారు. ఓల్డ్ సిటీలో 5.5 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణానికి రూ.500 కోట్లు, గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు మెట్రోరైల్ విస్తరణకు నిధులు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. షాదీ ముబారక్ కింద 2 లక్షల మందికి సాయం చేశారని తెలిపారు. ఉర్దూ మీడియం అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఉర్దూలో డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు.. రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేదని అక్బరుద్దీన్ పేర్కొన్నారు.