Telangana Culture in Syllabus | అశోకుడు చెట్లు నాటించెను. బాబర్ దండెత్తి వచ్చెను. బ్రహ్మనాయుడు చాపకూడు పెట్టించెను. తరతరాలుగా ఇవే పాఠాలు. చరిత్ర చూసినా, భాషా వాచకాలు చదివినా.. ఇవే సంగతులు. ఇప్పుడు చరిత్ర మనది. ఘనతలు మనవి. తెలంగాణ ఏర్పడ్డాక సాధించిన విజయాలు మనవి. ఆ ప్రత్యేకతలే ఇప్పుడు పాఠాలు అవుతున్నాయి. యువ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర పాటవాన్ని విడమరుస్తున్నాయి. ఇంటర్మీడియట్ ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లో తెలంగాణం పల్లవిస్తున్నది. రామప్ప ప్రాభవం, కాళేశ్వరం జలకేతనం, యాదగిరిగుట్ట వైభవం ఒక్కటేమిటి తెలంగాణ వ్యక్తులు, శక్తులు సాధించిన విజయాలు పాఠ్యాంశాలుగా విద్యార్థులకు మన ప్రగతిని పరిచయం చేస్తున్నాయి.
తెలంగాణ అంటే పోరాటం. తెలంగాణ అంటే సంస్కృతి, సంప్రదాయాలు. చరిత్రకెక్కని ఆ పోరాట యోధుల గాథలు ఇప్పుడు పాఠాలు అయ్యాయి. తరాల అంతరాలతో మరచిపోతున్న సంప్రదాయాలు పాఠ్యాంశాలుగా మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర వారసత్వానికి ప్రతీకలైన ఎన్నో అంశాలను ఇప్పుడు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లో పాఠాలుగా చేర్చారు. రీడింగ్ కాంప్రహెన్సివ్ పేరుతో ఒక్కో పాఠ్యపుస్తకంలో 15 అంశాలను పొందుపరిచారు. తెలంగాణ ప్రత్యేకతను, ప్రగతిని చాటిచెప్పే 60 అంశాలు సిలబస్లో చేర్చారు. గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో ఈ మార్పులు చోటుచేసుకోగా, ఈ ఏడాది రెండో సంవత్సరం ఆంగ్ల పాఠ్యపుస్తకంలోనూ దశ మారిన తెలంగాణను కండ్లకుకట్టారు.
అందరూ ఉన్నా అభాగ్యులుగా అక్కడికి చేరుతారు. ఆ గూటిలో అందరిలో ఒకరవుతారు. మలిసంజెలో ముసురుకున్న చీకట్లను పారదోలి శేష జీవితంలో కొత్త వేకువను ఉదయింపజేస్తున్నది ‘ఆనంద నిలయం’ వృద్ధాశ్రమం. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి సమీపంలో రాజీవ్ రహదారి పక్కన ఈ ఆశ్రమం ఉంది. 2010లో ఆశ్రమానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి, ఆయన సతీమణీ కేవీ లతా రమణాచారి చొరవతో ఈ ఆశ్రమం రూపుదాల్చి.. నిస్సహాయులైన వృద్ధుల జీవితాలకు భరోసాను ఇస్తున్నది. కడుపున పుట్టినవారు కనికరం చూపకపోవడంతో ఆశ్రమానికి చేరిన అభాగ్యులు ఆనంద నిలయంలో మహదానందంగా జీవితాలను వెళ్లదీస్తున్నారు.
ఆనంద నిలయం 95 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 54 మంది వృద్ధులు జీవిత చరమాంకాన్ని ప్రకృతి ఒడిలో హాయిగా గడుపుతున్నారు. ఇదే ప్రాంగణంలో అనాథ శరణాలయమూ వెలిసింది. పక్కనే పన్నెండు ఎకరాల్లో శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతన్ రెసిడెన్షియల్ మహిళా కళాశాల ఏర్పాటైంది. మరో ఐదు ఎకరాల్లో సత్యసాయి సంజీవని పిల్లల హృద్రోగ దవాఖాన నిర్మాణం చేపట్టారు. మరో ఐదు ఎకరాల స్థలంలో దేవాలయం నిర్మించారు. ఓవైపు మామిడితోట, ఇంకోవైపు గోశాల నిర్మించారు. ఒకప్పుడు బంజరుభూమిలా ఉన్న ఆనంద నిలయం పరిసరాలు ఇప్పుడు చిక్కటి పచ్చదనంతో ఆకృతి దాల్చిన ప్రకృతికి మచ్చుతునకలా దర్శనమిస్తాయి. ఆనంద నిలయంలో 70 మంది వృద్ధుల నివాసానికి అనువుగా గదులు నిర్మించారు. మరో 20 మంది కోసం ఏసీ గదులు ఏర్పాటుచేశారు.
ప్రస్తుతం సాధారణ గదుల్లో 38 మంది, ఏసీ గదుల్లో 16 మంది ఉంటున్నారు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ వి‘శేష’ జీవితాన్ని గడుపుతున్నారు. వయోధికులకు సాయంగా ఉండటానికి 30 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అనాథ పిల్లల బాగోగులను చూసుకునేందుకు ఇదే ప్రాంగణంలో బాలసదనం ప్రారంభించారు. దాదాపు నలభై మంది అనాథ బాలలు ఇక్కడ ఏ లోటూ లేకుండా బతుకుతున్నారు. వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే, ఆనంద నిలయ వృద్ధాశ్రమం పాఠ్యాంశంగా పుస్తకానికి ఎక్కింది. విద్యార్థులకు ఉత్తమ ఆలోచనలను ప్రసాదించే శక్తి పాఠాలకే ఉంది. గొప్ప పాఠాలు మార్కులనే కాదు, వ్యక్తిత్వాన్నీ ఇస్తాయి. మంచి వైపు నడిపిస్తాయి. అప్పుడిక వృద్ధాశ్రమాల అవసరమే ఉండదు.
ఐదెకరాల సువిశాల ప్రాంగణం. అందులో 76 గదులు. ఇవి ఒక పాఠశాల ప్రాథమిక వివరాలు. మౌలిక సదుపాయాలు, అద్భుత బోధన ఆ బడికి అదనపు హంగులు. ఇలాంటి పెద్ద పాఠశాలలో రెండు వేల మంది విద్యార్థులు చదువుతున్నారేమో! అని తొందపడి అంచనాకు వచ్చేయకండి. ఇన్ని విశేషాలున్న ఈ బడి ఒడిలో కేవలం 300 మంది విద్యార్థులు అక్షరాలు దిద్దుతున్నారు. వారి వారి ఆసక్తుల్లో శక్తివంచన లేకుండా రాటుదేలుతున్నారు.
పాఠశాల విద్యకు కొత్త నిర్వచనం చెబుతూ, విద్యార్థుల జీవితాలను మహోన్నతంగా తీర్చిదిద్దుతున్నది సూర్యపేట జిల్లా కోదాడలోని తేజ విద్యాలయం. దశాబ్ద కాలంగా వందలాది విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతున్న ఈ విద్యాలయాన్ని స్ఫూర్తి కేంద్రంగా అభివర్ణిస్తూ.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పుస్తకంలో పాఠంగా పొందుపరిచారు. ఇక్కడి బోధనా విధానంపై ‘పుస్తక ప్రపంచమా.. ప్రపంచ పుస్తకమా’ శీర్షికన ఓ వ్యాసాన్ని ప్రచురించారు. మైదానం లేని పాఠశాలలు, ఇరుకైన తరగతి గదులు, సబ్జెక్టుపై పట్టుకోసం బట్టీ పట్టడాలు, మార్కుల కోసం కుస్తీ పట్టడాలు.. ఇదీ సింహభాగం ప్రైవేట్ పాఠశాల తీరు. ఇక విశాలమైన మైదానం, డిజిటల్ క్లాస్రూమ్లు ఉన్నట్లయితే ఫీజు లక్షల్లో చెల్లించాల్సిందే. ఇందుకు భిన్నంగా అందుబాటు ఫీజులోనే అన్ని సౌకర్యాలతో అసలైన విద్యను అందిస్తున్నది తేజ విద్యాలయం. 2012లో రమాదేవి, సోమిరెడ్డి దంపతులు ఈ పాఠశాలను నెలకొల్పారు. సోమిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ విద్యా విధానంలో మార్పు లక్ష్యంగా విద్యాలయం స్థాపించారు. భర్త సంకల్పాన్ని నెరవేర్చే దిశగా రమాదేవి పాఠశాలను నిర్వహిస్తున్నారు. ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థులు ఉండేలా, 120 మంది పిల్లలతో పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం 300 మందికిపైగా విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. పాఠశాల పూర్వ విద్యార్థుల్లో 95 శాతం మంది ఇంజినీర్లు, డాక్టర్లుగా, ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడ్డారు. అవార్డులూ సత్కారాలూ అందుకున్నారు.
ఒత్తిడి లేని విద్య తేజ విద్యాలయం ప్రత్యేకత. ఎన్సీఈఆర్టీ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ బోధన జరుగుతుంది. జీవన నైపుణ్యాలు, రచనా వ్యాసంగం, లలితకళలు, హస్తకళలు, సృజనాత్మక అంశాల్లో పిల్లలను మేటిగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పించేలా తోటపని కూడా భాగం చేశారు. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలుపరిచేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచారు. తేజ విద్యాలయం ఎనిమిదో తరగతి విద్యార్థిని సమృత చంద్రయాన్-2 ప్రయోగం ప్రత్యక్ష ప్రసారాన్ని బెంగళూరులో ప్రధాని మోదీతో కలిసి చూసే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్నీ పాఠ్యాంశంలో
పేర్కొనడం విశేషం. ‘ఇంటర్ ఆంగ్ల పాఠ్యపుస్తకంలో మా పాఠశాల గురించి పాఠంగా ఇవ్వడం ఆనందంగా ఉంది. విద్యా వ్యవస్థలో మార్పు కోసం మేం చేసిన కృషికి దీన్నో గుర్తింపుగా భావిస్తున్నాం’ అంటారు తేజ విద్యాలయ నిర్వాహకురాలు రమాదేవి. దేశానికి కావలసింది ఇలాంటి విద్యాసంస్థలే.
ఒకవైపు వృద్ధులు, మరోవైపు అనాథలు.. వీరి బాగోగులను ఆనంద ట్రస్ట్ సహృదయంతో స్వీకరించింది. సిద్దిపేటకు చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు, ఇతర ధర్మకర్తలు పాలన బాధ్యతలు చూస్తున్నారు. ఈ బృహత్ కార్యంలో కర్ణాటకకు చెందిన పారిశ్రామికవేత్త సుధా జనార్దన్, హైదరాబాద్లోని హోటల్ సుప్రభాత్ (కృష్ణమూర్తి-కిరాణా) సహకారం అందుతున్నది. గతంలో సిద్దిపేట రైస్ మిల్లర్లు సైతం తమవంతు సహకారాన్ని అందించారు. ఆనంద ట్రస్ట్ చైర్పర్సన్ లతా రమణాచారితోపాటు ఏడుగురు ట్రస్ట్ సభ్యులు, పన్నెండు మంది డైరెక్టర్లు పాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
‘కరోనా’ కాలంలో యావత్ ప్రపంచమే స్తంభించిపోయింది. లక్షలాది మందిని బలితీసుకున్న వైరస్కు జడిసి గడప దాటాలంటేనే వణికిపోయారు ప్రజలు. కానీ, అదే సమయంలో నేనున్నానంటూ ముందుకొచ్చాడు నగరానికి చెందిన అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావు. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆకలి కేకలతో అలమటించిన వారిని చేరదీసి కడుపునింపాడు. మరోవైపు కరోనా కాటుకు బలైనవారికి అంతిమ సంస్కారం నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఆయన సేవలను ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం.
ఖమ్మం పట్టణానికి చెందిన అన్నం శ్రీనివాసరావు సమాజ సేవలో ముందుంటారు. ‘అన్నం ఫౌండేషన్’ ద్వారా కొన్ని సంవత్సరాలుగా బీదసాదలకు సాయం చేస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వెయ్యికి పైగా కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేపట్టారు. మృతుల వివరాలను సేకరించి వారి సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు చేయడం గొప్ప విషయం.
లాక్డౌన్ సమయంలో వందలాది మంది వలస కూలీలకు బాసటగా నిలిచారు శ్రీనివాసరావు. ఉన్నచోట ఉపాధి లేక, స్వరాష్ర్టాలకు వెళ్లలేక సతమతమవుతున్న కూలీలను చేరదీసి ఆకలి తీర్చారు. కరోనా సోకిన వారిని కుటుంబసభ్యులే అంటరానివారిగా చూస్తుంటే, తానుమాత్రం ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. పోలీసులు, వైద్యులు సైతం అన్నం ఫౌండేషన్ సేవలను వినియోగించుకున్నారు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఆయన చేసిన సేవలు తాజాగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పాఠ్యపుస్తకంలో పొందుపరిచారు. దశాబ్ద కాలంగా అన్నం ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు చేస్తున్న సేవలను కూడా ఇందులో ప్రస్తావించారు. విద్యార్థుల్లో సమాజంపట్ల అంకితభావం పెంచేందుకు.. శ్రీనివాసరావు సేవాయాత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ‘నా సేవలను పాఠ్యపుస్తకంలో చేర్చడం ఆనందంగా ఉంది. ఈ పాఠ్యాంశం కొద్దిమంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చినా నా ప్రయత్నం మరింత విజయవంతం అయిందని భావిస్తాను’ అంటారు అన్నం శ్రీనివాసరావు.
తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద రామప్ప దేవాలయం. ఇటీవల యునెస్కో గుర్తింపు సాధించిన ఈ ఆలయం పర్యాటక కేంద్రంగా పరిఢవిల్లుతున్నది. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు లేని కాలంలో నిర్మించిన రామప్ప గుడిలో కనీవినీ ఎరుగని వింతలు కనిపిస్తాయి. శతాబ్దాలుగా చెక్కుచెదరని ఈ ఆలయాన్ని భూకంపాలను సైతం తట్టుకునే విధంగా ఇసుక పునాదితో నిర్మించారు. స్థానికంగా లభ్యమయ్యే ఎర్రని డోలరైట్ రాయిని నిర్మాణంలో ఉపయోగించారు. నల్లని గ్రానైట్ (చలువరాయి) శిలలను ప్రత్యేకంగా తెప్పించి ఆలయ రంగ మంటపం కట్టారు. కఠినమైన రాతిపై శిల్పాలు చెక్కిన తర్వాత అద్దంలాంటి నునుపుదనం వచ్చేంత వరకు చిత్రిక పట్టారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న రామప్ప ఆలయ వైభవాన్ని పాఠ్యాంశంగా చేర్చడం గొప్ప విషయం.
తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల ఇది. గోదారికి కొత్త దారి చూపి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ప్రాజెక్టు ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తి
పోతల పథకంగా నిలిచింది కాళేశ్వరం ప్రాజెక్టు. గొలుసుకట్టుగా నిర్మించిన జలాశయాలు దశాబ్దాలుగా తెలంగాణలో తిష్ఠవేసుకొని కూర్చున్న కరువును కలిసికట్టుగా తరిమేశాయి. భారీ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఒక అద్భుతం. ప్రాజెక్టు ఫలితంగా జరుగుతున్న అభివృద్ధి మహాద్భుతం. ఈ విషయాలన్నిటినీ కాళేశ్వరం కథగా విద్యార్థులకు అందించారు.
తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక కేంద్రం యాదగిరిగుట్ట. లక్ష్మీనరసింహ స్వామి స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రం ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయింది. రాష్ట్ర కల సాకారం అయ్యాక తెలంగాణ పునర్నిర్మాణంతోపాటు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పోటాపోటీగా సాగాయి. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో నిర్మాణ క్రతువు అద్భుతంగా సాగింది. ఆలయ నిర్మాణం ఒక ఎత్తు అయితే, ఆలయ శిఖరానికి స్వర్ణ తాపడం చేయిస్తుండటం మరో ప్రత్యేకత. యాదగిరీశుడి ఆలయ గోపురాలకు చేయించిన బంగారు తాపడం 50 ఏండ్ల వరకు చెక్కు చెదరకుండా రాకెట్ల ప్రయోగానికి వినియోగించే నానో టెక్ గోల్డ్ డిపాజిషన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఈ విశేషాలన్నీ ఇంటర్ పాఠ్యాంశం ద్వారా తెలుసుకోవచ్చు.
ఇన్పుట్స్ : కత్తుల శ్రీనివాస్ రెడ్డి, మాటేటి వేణుగోపాల్, శ్రీనివాస్ గుప్తా