న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నాన్ కొవిడ్ టీకాల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపింది. యూనిసెఫ్ (UNICEF) విడుదల చేసిన డేటా ప్రకారం.. 2020లో దేశంలో వ్యాక్సిన్ క్యాంపెయిన్ భారీగా తగ్గిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తల కొరత కారణంగా ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ తగ్గగా.. పొరుగుదేశాలైన పాక్, బంగ్లా, శ్రీలంక కంటే దేశం వెనుకబడిపోయింది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (UIP) భారతదేశంలో 1980లో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం కింద దేశంలో నవజాత శిశువులు, పిల్లలకు డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, మీజిల్స్, తీవ్రమైన పిల్లల క్షయ, హెపటైటిస్ బీ, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బీ (Hib), డయేరియా వ్యాక్సిన్లు వేస్తున్న విషయం తెలిసిందే.
2019తో పోల్చితే 2020లో 12 నుంచి 23 నెలల పిల్లలకు ఇచ్చే మూడో డోస్ పోలియో వ్యాక్సిన్ ఐదు శాతం తగ్గిందని యునిసెఫ్ డేటా పేర్కొంది. 1991 తర్వాత భారీగా తగ్గడం ఇదే తొలిసారి. దేశంలో పోలియో ఇమ్యునైజేషన్ 2014 స్థాయికి దిగజారింది. మొత్తం కవరేజీ దాదాపు 85 శాతం. అదే విధంగా, డీపీటీ (డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం) విషయంలో 12-23 నెలల పిల్లలకు ఇచ్చే మోతాదు 7శాతం తగ్గింది. గత సంవత్సరంతో పోలిస్తే, క్షయవ్యాధి (TB) టీకాలు కూడా ఏడు శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
నివేదిక ప్రకారం.. పిల్లల్లో రోటా వైరస్ వ్యాక్సిన్, కొత్త న్యుమోకాకల్ వ్యాక్సిన్ పంపిణీ గత సంవత్సరంతో పోలిస్తే పెరిగింది. 12-23 నెలల వయస్సు గల పిల్లలకు రోటా వైరస్ వ్యాక్సిన్ కవరేజీ 53 శాతం నుంచి 82 శాతానికి చేరగా.. 29 శాతం పెరిగింది. అయితే, న్యుమోకాకల్ వ్యాక్సిన్ కవరేజీ 2019 – 2020 మధ్య 15 శాతం నుంచి 21 శాతానికి పెరిగింది. 1989-90 నాటికి అన్ని జిల్లాలను కవర్ చేయాలని దేశ ఇమ్యూనైజేషన్ కార్యక్రమం చేపట్టగా.. దేశం అన్ని వ్యాక్సినేషన్ ప్రమాణాలపై పురోగతి సాధిస్తూ వస్తుండగా.. మహమ్మారి కారణంగా దాని వేగం తగ్గింది.
భారత్లో టీకాల పంపిణీని ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే.. దేశంలో పేలవంగా ఉన్నది. టీబీ వ్యాక్సిన్ల తగ్గుదల విషయంలో మెక్సికో, బ్రెజిల్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కంటే భారత్ వెనుకబడిపోయింది. దక్షిణాసియా దేశాలతో పోలిస్తే పాక్, ఆఫ్ఘనిస్తాన్తో పోల్చినా భారత్ పరిస్థితి దారుణంగా ఉన్నది. కరోనా సవాళ్ల మధ్య లాక్డౌన్, ఆంక్షలు అడ్డంకిగా నిలిచినా 2020లో బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలు టీబీ వ్యాక్సిన్లో అగ్రస్థానంలో నిలిచాయి. హైపటైటిస్ బీ వ్యాక్సిన్ విషయంలో భారత్.. బ్రెజిల్, ఇండోనేషన్ కంటే వెనుకబడింది. దక్షిణాసియా ప్రాంతంలో డీపీటీ వ్యాక్సిన్లో భారత్ తర్వాత పాక్, నేపాల్ మాత్రమే ఉన్నాయి. బ్రెజిల్, ఇండోనేషియాలో మీజిల్స్ అండ్ రుబెల్లా వ్యాక్సిన్ దారుణంగా ఉన్నది. ఇమ్యునైజేషన్ టీకాల పంపిణీ ప్రభావితం కావడానికి ప్రధాన కారణాల్లో ఆరోగ్య కార్యకర్తల కొరత కారణంగా పేర్కొంటున్నారు.