మహబూబ్ నగర్ : జిల్లాలోని దేవరకద్ర మండలంలో నిర్మించ తలపెట్టిన పేరూర్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఇందుకోసం రూ.51 కోట్ల నిధులను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రామన్ పాడు బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు పేరూరు వద్ద ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని నిర్ణయించింది.
దీని ద్వారా పేరూరు, వెంకపల్లి, అమ్మాపూర్, వెంకట గిరి, రేకుళంపల్లి, దాసరి పల్లిలోని 3500 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రెండురోజులుగా జరుగుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సమీక్షలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పేరూర్ లిఫ్టును మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను అభ్యర్థించారు.
ఈ మేరకు పరిపాలనా అనుమతులతోపాటు నిధులు విడుదల చేయడంతో ఆల వేంకటేశ్వర్ రెడ్డి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.