ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. అందులో భాగంగా ‘మన ఊరు-మన బడి’ ద్వారా ఈ యేడాది నుంచి ఆంగ్ల బోధన అమలు చేస్తుండగా, అందుకను గుణంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. పైసా ఖర్చు లేకుండా మెరుగైన విద్య అందుతుండగా, ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు విద్యార్థులు క్యూ కట్టారు. జూన్ 30తో ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ ముగియగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 11,068 మంది విద్యార్థులు చేరారు. ప్రస్తుతం బడులన్నీ కిటకిటలాడుతుండగా, పూర్వ వైభవం సంతరించుకున్నాయి. – నిర్మల్ (నమస్తే తెలంగాణ)/ నిర్మల్ అర్బన్, జూలై 1
‘ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అనాసక్తితో విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టేవారు. ఇప్పుడు.. మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకే ఆసక్తి కనబరిచారు. ప్రభుత్వ బడుల్లోనూ ఆంగ్ల బోధన, సాంకేతిక విద్య అందిస్తుండడం.. ఉచితంగా పుస్తకాలు, భోజనం, దుస్తులువంటి పంపిణీ చేయడం.. కార్పొరేట్కు దీటుగా సౌకర్యాలు మెరుగుపడిన నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జూన్ 30 నాటికి కొత్తగా 11,068 మంది అడ్మిషన్లు పొందారు. చాలా వరకు అడ్మిషన్లు ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజుల మోత తప్పకపోవడం, కొవిడ్ పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఇది భారం కావడంవంటి కారణాలతో.. వారు ప్రభుత్వ పాఠశాలల వైపు అడుగులు వేస్తున్నారు.
భవిష్యత్తుకు సర్కారు బడులే సరైనవి
తమ పిల్లల భవిష్యత్తుకు సర్కారు బడులే సరైనవని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. కొంతమంది ప్రైవేట్ నుంచి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలతోపాటు యూనిఫాం ఉచితంగా అందిస్తున్నాం. ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించుకో వడంతోపాటు, జాతీయ ఉపకార వేతనాలను అందుకునే అవకాశం ఉంది. ఇవన్నీ ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు వివరిస్తుండడం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.
– రవీందర్ రెడ్డి, డీఈవో, నిర్మల్ జిల్లా
బడిబాటతో జోరుగా ప్రవేశాలు..
ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చింది. జూన్ 13 నుంచి విద్యా సంస్థలను ప్రారంభించి బడిబాట చేపట్టిన నేపథ్యంలో అన్ని తరగతుల్లోనూ ప్రవేశాలు జోరందుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతోందనడానికి ప్రస్తుతం మారిన పరిణామాలే ఇందుకు నిదర్శనమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపడ్డ వసతులు, బోధనా నైపుణ్యాలపై ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి చెప్తూ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో చైతన్యం తెచ్చే దిశగా చొరవ చూపారు. అంగన్వాడీల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వారిని ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించా రు. అలాగే ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశా లల్లో చదువులు పూర్తయిన వారు ఉన్నత పాఠశాలల్లో చేరేలా శ్రద్ధ చూపించారు. ప్రభుత్వ బడులను కాపాడుకునేందుకు ఇలా నేరుగా ఉపాధ్యాయులే రంగంలోకి దిగడం వల్ల సత్ఫలితాలు వచ్చాయి.
అందరిదీ సర్కారు బాటే..
దాదాపుగా రెండేళ్లపాటుగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఈ క్రమంలో విద్యాబోధనకు ఆటంకాలు కలగకుండా 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు టీ-శాట్, దూదర్శన్ ద్వారా తరగతులు నిర్వహించారు. ఉపాధ్యాయులతో పాటు మానిటరింగ్ బృందాలు ఇంటి వద్ద విద్యార్థులు పాఠాలు వినేలా చర్యలు తీసుకున్నాయి. ఈ ఏడాదిలో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చెబుతున్న పాఠాలకు, కార్పొరేట్ పాఠశాలల్లో అందిస్తున్న విద్యాబోధనకు పెద్దగా తేడా ఉండడం లేదన్న భావన సైతం తల్లిదండ్రుల్లో వచ్చింది. వేలాది రూపాయల ఫీజులు చెల్లించే బదులు ఉత్తమ విద్యాబోధన, ఎన్నో వసతులు ఉన్న సర్కారు పాఠశాలల్లోనే చేర్పించడం మేలంటూ చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఆంగ్ల మాధ్యమ బోధన, సాంకేతిక విద్య అందుబాటులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇటువైపుగా అడుగులు వేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకుల్లో ప్రతిభ కనబర్చడం, ట్రిపుల్ ఐటీ, జాతీయ ఉపకార వేతనాలకు అర్హత పొందడంలోనూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులదే పైచేయిగా ఉంటుండడం వంటి అనుకూల పరిస్థితులు ప్రభుత్వ పాఠశాలలకు వరంగా మారింది.
ఇప్పటి వరకు 11,068 మంది చేరిక
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలో ఈ ఏడాది కొత్తగా 11,068 మంది అడ్మిషన్లు పొందారు. నిర్మల్ జిల్లా విషయానికొస్తే..19 మండలాల పరిధిలో మొత్తం 735 వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 533, ప్రాథమికోన్నత పాఠశాలలు 85, హైస్కూళ్లు 533 వరకు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 13 నుంచి ప్రవేశాల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి, ఇంటర్ వరకు 3,463 మంది కొత్తగా అడ్మిషన్లు పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల్లో చాలామంది అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చినవారు, ప్రైవేట్ స్కూళ్లకు గుడ్బై చెప్పిన వారు ఉన్నారు. ఫోర్త్ వేవ్లో కరోనా కేసులు పెరుగుతుండడం.. ఎక్కడో దూర ప్రాంతాల్లో చేర్పిస్తే తమ పిల్లలు ఎలా అన్న బెంగతో చాలామంది తల్లిదండ్రులు దగ్గరలో ఉండే పాఠశాలల్లోనే తమ పిల్లలకు ప్రవేశాలు తీసుకున్నారు. స్కూళ్ల ఓపెనింగ్ తర్వాత చేపట్టిన బడిబాట కార్యక్రమంలో చాలామంది అడ్మిషన్లు తీసుకున్నారని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
‘మన ఊరు..మన బడి’తో మహర్దశ
‘మన ఊరు..మన బడి, మన బస్తీ మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలకు ఈ విద్యాసంవత్సరంలో మహర్దశ వచ్చింది. ఈ కార్యక్రమం కింద నిర్మల్ జిల్లాలోని 260 పాఠశాలలను తొలివిడుతలో ఎంపిక చేశారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 159, ప్రాథమికోన్నత పాఠశాలలు 29, ఉన్నత పాఠశాలలు 72 వరకు ఉండగా, అర్బన్ ఏరియాలో 26 పాఠశాలలు, రూరల్ ఏరియాలో 234 పాఠశాలలు ఉన్నాయి. రూ.30 లక్షల లోపు పనులు చేపట్టే పాఠశాలలు 177 వరకు ఉండగా, తొలుత 94 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 15 శాతం డబ్బులను అడ్వాన్స్ రూపంలో ఆయా పాఠశాలల అకౌంట్లలో జమ చేయడం కూడా పూర్తయ్యింది. 38 పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 121 పాఠశాలల్లో నూతన గదుల నిర్మాణ పనులు జరుగుతుండగా, 239 పాఠశాలల్లో తాగు నీటి సౌకర్యాన్ని మెరుగుపర్చారు. 13 పాఠశాలలకు ప్రహరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 74 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ప్రత్యేక గదులను నిర్మించే దిశగా పనులు సాగుతున్నాయి. 246 పాఠశాలల్లో తరగతి గదులకు మరమ్మతులు జరుగుతున్నాయి. అలాగే 15 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు మరమ్మతులు చేపట్టడంతో పాటు కొన్ని చోట్ల నూతనంగా నిర్మాణాలను చేపడుతున్నారు. త్వరలోనే ఈ పాఠశాలలు కొత్త రూపును సంతరించుకోనున్నాయి.