దస్తురాబాద్, డిసెంబర్ 16 : తప్పుల్లేని ఓటరు జాబితా అందించాలని తహసీల్దార్ జీ లక్ష్మి బీఎల్వోలను ఆదేశించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో శుక్రవారం ఆమె బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్డీవో ఆదేశాల మేరకు బీఎల్వోలు 18 ఏండ్లు నిండిన యువతి, యువకులను గుర్తించి ఫారం-6లో ఓటరుగా నమోదు చేయాలని చెప్పారు. ఫారం-7లో మరణించిన వారి పేర్లను నమోదు చేసి తొలగించాలన్నారు. ఓటర్ల వివరాలు తప్పుగా ఉంటే ఫారం-8లో నింపాలని సూచించారు. వృద్ధులు, ప్రజాప్రతినిధులు, దివ్యాంగుల పేర్లను గుర్తించి వివరాలను నోట్ చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాలోని తప్పులను తొలగించి సరైన ఓటరు జాబితాను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు గంగన్న, పీ వెంకట నర్సయ్య, బీఎల్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆన్లైన్లో ఓటరు నమోదు పక్రియ
సోన్, డిసెంబర్ 16 : 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు, ఓటరు జాబితాలో పేర్లు లేని వారి వివరాలను నిర్మల్ రూరల్ తహసీల్ కార్యాలయంలో నమోదు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 8 వరకు ఓటరు జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తదితర అవకాశాలు కల్పించారు. వీటి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ఈ నెల 26 వరకు ఎన్నికల కమిషన్ గడువు విధించింది. దీంతో వాటిని పరిశీలించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రూరల్ తహసీల్దార్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు రెవెన్యూ సిబ్బంది కిషన్, సవిత ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.