బోథ్, డిసెంబర్ 14 : విద్యార్థులో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు శాస్త్రీయ నైపుణ్యం పెంచేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం మండల స్థాయి సైన్స్ ఫెయిర్, రామానుజం మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల, మండల స్థాయిలో పోటీలు ఏర్పాటు చేస్తే విద్యార్థుల్లో గెలవాలనే తపన కలుగుతుందన్నారు. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చి మండలానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ధన్నూర్(బీ) జడ్పీ పాఠశాల, కన్గుట్ట జడ్పీ, గురుకుల, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వారికి ఎంపీపీ నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు కిషన్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సొసైటీ చైర్మన్ ప్రశాంత్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో మేధోశక్తి వెలికితీసేందుకే సైన్స్ ఫెయిర్
నార్నూర్, డిసెంబర్ 14 : విద్యార్థుల్లో దాగిన మేధోశక్తిని వెలికి తీసేందుకే సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని ఎంఈవో రాపెల్లి ఆశన్న అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్కు ఇద్దరు విద్యార్థులు ఎంపికైన నేపథ్యంలో ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యంతో చదవాలన్నారు. రాష్ట్ర స్థాయికి విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్, ప్రత్యేకాధికారి హిమబిందు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.