సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ఎన్నుకున్న విద్యాకమిటీల పదవీకాలం ముగిసింది. 2019 నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించగా, కరోనా ప్రభావంతో ఏడాదిన్నర పాటు పాఠశాలలు కొనసాగలేదు. ఈ నేపథ్యంలో కొత్త వాటిని నియమించకుండా ఉన్నవాటినే కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది మే 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సారంగాపూర్, డిసెంబర్ 2 : సర్కారు బడుల బలోపేతానికి విద్యాశాఖ సరికొత్త కార్యక్రమాలతో ముందుకెళ్తున్నది. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులను భాగస్వాములను చేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నది. ఈ మేరకు యేటా ‘విద్యాకమిటీల’ను ఎన్నుకుంటారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు సభ్యులకు పాఠశాల నిర్వహణ, అభివృద్ధి విషయంలో బాధ్యతలు అప్పగిస్తారు. నవంబర్ 30తో విద్యా కమిటీల పదవీకాలం ముగియగా, తాజాగా మరో ఆరు నెలలు పొడిగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 503, ప్రాథమికోన్నత పాఠశాలలు 83, ఉన్నత పాఠశాలలు 109, ఆదిలాబాద్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 466, ప్రాథమికోన్నత 108, ఉన్నత పాఠశాలలు 127, మంచిర్యాల జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 506, ప్రాథమికోన్నత 96, ఉన్నత పాఠశాలలు 108, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 535, ప్రాథమికోన్నత 98, ఉన్నత పాఠశాలలు 51 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 2019 నవంబరు 30న ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించింది. కొత్త కమిటీలు ఏర్పాటైన మూడున్నర నెలలకే కరోనా ప్రభావంతో ఏడాదిన్నర పాటు పాఠశాలలు కొనసాగలేదు. నవంబర్ 30తో రెండేళ్ల పదవీకాలం ముగియగా, మే 31వ తేదీ, 2022 వరకు పదవీకాలాన్ని పొడిగించారు. కొవిడ్ కారణంగా పాఠశాలలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతుండగా కొత్త కమిటీలతో కాకుండా ఉన్నవాటిని కొనసాగించేందుకు విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
లక్ష్యం నెరవేరాలంటే..
విద్యా కమిటీల లక్ష్యం నెరవేరాలంటే బాధ్యతగా పని చేయాలి. అధికారులు తలపెట్టే ప్రతి కార్యక్రమం పాఠశాల స్థాయిలో విజయవంతంగా కొనసాగాలంటే వీరే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. కొవిడ్ ప్రభావంతో వీటి పాత్ర నామమాత్రంగానే మారింది. పాఠశాల సముదాయ స్థాయిలో మరోసారి వీరికి అవగాహన కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
విధులు ఇవే..
గ్రామంలోని బడీడు పిల్లలను విధిగా పాఠశాలల్లో చేర్పించాలి. విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి.
గ్రామాల్లోని దాతలు, ప్రజాప్రతినిధుల నుంచి నిధులు సేకరించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి.
ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేస్తూ పాఠశాల అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించాలి.
విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు విధానాన్ని పరిశీలించాలి. నిధులు సక్రమంగా ఖర్చుపెట్టే విధంగా పర్యవేక్షించాలి.
రాష్ట్ర, జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో ప్రతి కార్యక్రమం అమలు చేయించాల్సిన బాధ్యత ఉంటుంది.
విద్యాకమిటీలతో అభివృద్ధి
విద్యా కమిటీల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. విద్యాశాఖ ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామస్తులు, తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేందుకు ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. విద్యాకమిటీల వల్ల పాఠశాలలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది.