దస్తురాబాద్, డిసెంబర్ 2 : రైతులు ఆర్థిక అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వ్యవసాయానికి నిరంతరంగా ఉచితంగా 24 గంటల విద్యుత్ అందజేస్తున్నది. రైతు బంధు, రైతు బీమాతో భరోసా కల్పిస్తున్నది. సమైక్య రాష్ట్రంలో రైతులను తీవ్ర అన్యాయానికి గురిచేసింది. రైతులకు పంటల సాగు, రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చెప్పేవారు లేక అన్నదాతలు ఇబ్బంది పడేవారు. దీనిని గుర్తించిన సీఎం కేసీఆర్.. నిత్యం రైతులకు అధికారులు అందుబాటులో ఉండి వ్యవసాయ సేవలు అందించేందుకు కొన్ని గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగు విధానం, పంటల రకాలు, లాభనష్టాలపై రైతులను చైతన్యం చేసేందుకు రైతు వేదికలను నిర్మించింది. ఈ వేదికల్లో వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటూ రైతుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు.
మండలంలో రెండు క్లస్టర్లు..
మండలంలో రెండు వ్యవసాయ క్లస్టర్లున్నాయి. వీటి పరిధిలో నిర్మించిన రైతు వేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు తమ విధులను ప్రారంభించారు. పంటల వివరాలు, సమావేశాలు, విత్తనాలు, పండించిన పంటలు, పంటలకు సోకిన చీడపీడల నివారణపై అవగాహన సమావేశాలు, పం టల వివరాలు ఆన్లైన్లో నమోదు, విక్రయాలకు టోకెన్ల జారీ సైతం వంటి పనులు ఇక్కడ చేస్తున్నారు. దీంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పంటల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. స్థానికంగా ఉండే ఏఈవోలను కలిసి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు.
అందుతున్న సేవలు..
రైతులకు పంటల సాగులో సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు వారి సమస్యలను ఒక వేదికపై చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మండలంలో రెండు రైతు వేదికలను నిర్మించింది. మండలంలోని దస్తురాబాద్, రేవోజిపేట క్లస్టర్లలో రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. రూ.12 లక్షలు వ్యవసాయ శాఖ నుంచి, రూ.10 లక్షలు ఉపాధి హామీ పథకం నుంచి వెచ్చించింది. మొత్తంగా రూ.22 లక్షలతో ఒక్కో రైతు వేదిక నిర్మించారు. మండలంలోని రెండు క్లస్లర్లలో ఈ రైతు వేదికలు అందుబాటులోకొచ్చాయి. క్లస్టర్లలో భూసార పరీక్షలు, ఆన్లైన్ సేవలు, ఏ సమయంలో ఏఏ పంటలు సాగు చేయాలి? తదితర సందేహాలన్నీ రైతు వేదికలో ఉండే అధికారులను రైతులు అడిగి తెలుసుకోవచ్చు. వ్యవసాయశాఖ అందించే రోజువారీ సలహాలు, సూచనలు, సాంకేతిక పరిజ్ఞానం, యాజమాన్య పద్ధతులు, రాయితీలు, పంటల తెగుళ్ల ఉధృతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ.. ఏ మందు పిచికారీ చేయాలో వివరిస్తున్నారు. రైతు వేదికలో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన సదస్సులు, సమావేశాలు, సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
అందుబాటులో ఉంటున్నాం..
రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం క్లస్లర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. ప్రతిరోజూ రైతు వేదికల్లో అందుబాటులో ఉంటున్నాం. పంటల సాగులో రైతులకు ఎలాంటి సందేహాలు వచ్చినా స్థానికంగానే ఉండి నివృత్తి చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి, రైతులకు తగు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.రైతు వేదికల నిర్మాణంతో సమావేశపు గదిలో రైతుకు ఒకేచోట అవగాహన కల్పిస్తున్నాం. రైతులు సైతం నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు.
రైతులకు ఎంతో ప్రయోజనం..
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతి క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించింది. వీటితో రైతులకు ప్రయోజనం చేకూరుతున్నది. రైతు వేదికల నిర్మాణాలతో వానకాలం, యాసంగి పంటల సమయంలోనే కాదు.. అన్ని వేళల్లో భరోసానిస్తాయి. రైతులందరూ ఒకే చోట సమావేశమై పంటలపై చర్చించుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయశాఖ అధికారులు పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సులభంగా ఉంటుంది. సాగు పద్ధతులను సూచించేలా ఈ రైతు వేదికలు ఉపయోగపడుతున్నాయి. రైతు వేదికలు రైతులకు విజ్ఞాన కేంద్రాలు అని చెప్పవచ్చు.