కోటపల్లి, డిసెంబర్ 2 : మావోయిస్టు పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా వారోత్సవాలు ఉండగా, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని నిఘా పెంచారు. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాల సరిహద్దులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్ పోలీసులతో జల్లెడ పడుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేసి, సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించడంతో పాటు ప్రత్యేక దృష్టి పెట్టారు. కోటపల్లి మండలం రాపనపల్లిలో సరిహద్దు అంతర్రాష్ట్ర వంతెన వద్ద చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న వాహనాల తనిఖీని గురువారం జైపూర్ ఏసీపీ నరేందర్ పరిశీలించారు. అనుమానితులను విచారించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులతో 24 గంటలపాటు నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో మావోల కదలికలు లేకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా తని ఖీలు చేపడుతున్నామన్నారు. మహారాష్ట్ర పోలీసులతో పరస్పరం సమాచారం చేరవేసుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. ప్రాణహిత తీరం వెంట నిఘా ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు.