శ్రీరాంపూర్ : రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలల్లో తగినన్ని బొగ్గు నిల్వలు ఉండేలా ప్రతి రోజూ బొగ్గు రవాణా చేస్తున్నామని, తెలంగాణ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు కొరత ఏర్పడే ప్రసక్తే లేదని సింగరేణి సీఅండ్ఎండీ ఎన్ శ్రీధర్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలతో ఉత్పత్తి పెంపుదలపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 7సంవత్సరాలుగా తెలంగాణాలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎటువంటి బొగ్గు కొరత ఏర్పడకుండా సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కేంద్రాలలో సరిపడినన్ని బొగ్గు నిల్వలు సమకూర్చామని, ఇకపై కూడా ఇదే విధంగా బొగ్గు సరపరా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఎట్టి పరిస్థితిలో సింగరేణి ఒప్పంద పరిశ్రమలకు బొగ్గు కొరత రాకుండా చూస్తామని చెప్పారు. రానున్న కాలంలో మరింత పెంచుతామన్నారు. ఇకపై రోజుకు 90 వేల టన్నుల బొగ్గు రవాణాకు సిద్దమయ్యామని వివరించారు. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నందున వీటిని అధిగమించడానికి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి నవంబర్ నెల నుంచి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాల్సిన అవసరం ఏర్పడిందని, దీని కోసం సర్వం సన్నద్దం కావాలని సింగరేణీయులకు సీఆండ్ఎండీ ఎన్ శ్రీధర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో డైరెక్టర్లు చంద్రశేఖర్, సత్యనారాయణ, ఈడీ (కోల్మూమెంట్) జే అల్విన్, అడ్వైజరీ మైనింగ్ డీఎన్ ప్రసాద్, జీఎం (కోఆర్డినేషన్) కే సూర్యనారాయణ, శ్రీరాంపూర్ నుంచి జీఎం ఎం సురేశ్, ఎస్ఓటూజీఎం కే హరినారాయణగుప్తా, పీఓలు పురుషోత్తంరెడ్డి, రాజేశ్వర్రెడ్డి, ఏజీఎం సుధాకర్, డీవైజీఎంలు విజయభాస్కరెడ్డి, చిరంజీవులు, డీవీ రావు, నూక రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.